చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఉమ్మడి చిత్తూ రు జిల్లా పరిధిలో పదవీకాలం పూర్తయిన 119 ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహణకు కలెక్టర్ సుమిత్కుమార్ అనుమతినిచ్చినట్లు జిల్లా పశు సంవర్థక శాఖ అధికారిణి డి.ఉమామహేశ్వరి, జిల్లా సాంద్ర గొర్రెల అభివృద్ధి సంస్థ సహాయ సంచాలకులు డాక్టర్ ఎస్.రజని తెలిపారు. జిల్లాలో మొత్తం 257 ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలు ఉన్నాయి. వాటి లో 40 మండలాల పరిధిలోని 119 సంఘాల పాలక వర్గాల పదవీకాలం ముగిసిపోవడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు సెప్టెంబరు 1, 2, 3 తేదీల్లో ఎన్నికలు నిర్వహిస్తామని, అందుకు సంబంధించిన పక్కా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు. మండల పశుసంవర్థకశాఖ అధికారు లే ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తారని, నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు సంబంధిత గొర్రెల పెంపకందారులందరూ సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
పీఎం సూర్యఘర్పై
ప్రత్యేక దృష్టి
చిత్తూరు కార్పొరేషన్: పీఎం సూర్యఘర్ ద్వారా లబ్ధిదారుల నివాసాల్లో సోలార్ ప్యానల్స్ ఏర్పాటుపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల ని ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు ఆదేశించారు. ఆయన గురువారం ట్రాన్స్కో చిత్తూరు అర్బన్ ఈఈ కార్యాలయంలో డివిజన్ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జనరల్ కేటగిరి లబ్ధిదారులకు వేగంగా సోలార్ కనెక్షన్స్ ఇవ్వాలన్నా రు. అలాగే ఎస్సీ, ఎస్టీ సర్వీసులకు సోలార్ కనెక్షన్ ఇవ్వడానికి మరింత చొరవ చూపాలన్నా రు. సంబంధిత కాంట్రాక్టర్లతో మాట్లాడి వేగం పెంచాలన్నారు. వాణిజ్య సర్వీసులకు స్మార్ట్ మీటర్లు వందశాతం బిగించాలని, పెండింగ్ వర్క్ ఆర్డర్లను నెలఖరులోపు పూర్తి చేయాలని పేర్కొన్నారు. అలాగే ఆర్డీఎస్ఎస్ పనులను వేగవంతం చేసి మూడు నెలల్లో పూర్తి చేయాల ని ఆదేశించారు. విద్యుత్ బిల్లుల వసూళ్లు ప్రతి నెలా వందశాతం చేయాలన్నారు. వ్యవసాయ సర్వీసులను సకాలంలో మంజూరు చేయాల న్నారు. ట్రాన్స్ఫార్మర్లకు సకాలంలో మరమ్మతులు చేయాలని సూచించారు. విద్యుత్ బకాయిలు చెల్లించని సర్వీసులను తొలగించాలని ఆదేశించారు. సమావేశంలో ఈఈ మునిచంద్ర, డీఈ ప్రసాద్, ఏఈలు పాల్గొన్నారు.
పకడ్బందీగా ఆధార్ ప్రక్రియ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఆధార్ నమోదు, నవీకరణ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని డీఆర్ఓ మోహన్ కుమార్ ఆదేశించారు. ఆయన గురువారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. డీఆర్ఓ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 238 ఆధార్ కిట్లు పనిచేస్తున్నాయని తెలిపారు. గత 30 రోజుల్లో 30,103 లావాదేవీలు జరిగినట్లు చెప్పారు. 0–5 ఏళ్ల పిల్లల ఆధార్ నమోదు శాతాన్ని పెంచేందుకు అంగన్వాడీ, వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని సూచించారు. 5–15 ఏళ్లలోపు పిల్లలు, 15 ఏళ్లు దాటిన వారు తప్పనిసరిగా బయోమెట్రిక్ నవీకరించుకోవాల ని తెలిపారు. ప్రతినెలా పిల్లల నమోదు, బయోమెట్రిక్ అప్డేట్లకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మొబైల్ నంబర్ అనుసంధానం, చిరునామా సవరణ వంటి సేవలను సమీపంలోని అధికారిక ఆధార్ కేంద్రాల్లో పొందవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ షాను, డీఎల్డీఓ రవికుమార్, డీఈవో లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యనందించాలి
తిరుపతి ఎడ్యుకేషన్: ఓపెన్ స్కూళ్లల్లో నాణ్యమైన విద్యనందించాలని రాష్ట్ర ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ ఆర్.నరసింహారావు తెలిపారు. ఆయన గురువారం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులు, ఓపెన్ స్కూల్ ఏఐ కో–ఆర్డినేటర్లు, సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఓపెన్ స్కూల్లో నాణ్యమైన బోధన అందించి, స్వయంగా అర్థం చేసుకుని పరీక్షలు రాసేలా అభ్యర్థుల్లో సామర్థ్యాన్ని పెంపొందించాలని సూచించారు. డీఈఓ కేవీఎన్.కుమార్ మాట్లాడుతూ ఓపెన్ స్కూల్లో పది, ఇంటర్ ప్రవేశాలకు సెప్టెంబరు 15వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు తెలపారు.


