ఉపాధిలో అవినీతిపై కఠిన చర్యలు
గుడిపాల: ఉపాధి హామీలో అవినీతి జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా? ప్రతిరోజూ ఉపాధి కూలీలు, రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, ఇకపై ఉపేక్షించేది లేదని ఎంపీడీవో శిరీష ఫీల్డ్ అసిస్టెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధిహామీలో అవినీతి పుట్ట అన్న శీర్షికన గురువారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనంపై ఆమె స్పందించారు. ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశమయ్యారు. ఆమె మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో ఎంత అవినీతి జరిగి ఉంటే ప్రతిరోజూ పత్రికల్లో కథనాలు వస్తాయని మండిపడ్డారు. ఇకపై మీ ఆటలు సాగవని, తాను ఉపాధహామీ కార్యాలయంలోనే కూర్చోవాల్సి వస్తుందన్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి పంచాయతీలోనూ ఉపాధి కూలీలతో స్వయంగా మాట్లాడి రోజుకు సగటున ఎంత కూలి వస్తుంది అన్న వివరాలు తెలుసుకుంటానన్నారు. కొబ్బరి, మామిడి మొక్కల బిల్లులు పెట్టేటప్పుడు రైతులకు తెలియజేయాలని, వారికి తెలియకుండా మస్టర్లు పెడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. టెక్నికల్ అసిస్టెంట్లు కూడా క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించాలని, కూలీలు, రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకోవాలని ఆదేశించారు. ఏయే పనులకు ఎంత డబ్బులు జమ అయ్యిందో తెలియజేయాలని సూచించారు. ఉపాధిహామీ పనుల పై ఆకస్మిక తనిఖీలు చేస్తామని, చీలాపల్లె పంచాయతీలో రైతులు నాటుకున్న కొబ్బరి, మామిడి మొక్కల బిల్లులను స్వాహా చేసిన విషయంపై పూర్తి నివేదికలు అందజేయాలని ఏపీవో పుష్పలత, టెక్నికల్ అసిస్టెంట్ మునిరత్నంను ఆదేశించారు.


