తిరుపతి సిటీ : జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు వెబ్ డెవలపర్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు బుధవారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంకేవీవై 4.0 పథకంలో భాగంగా జిల్లాలోని నిరుద్యోగ యువతను గుర్తించి ఆయా ప్రాంతాలలోని పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలకు అనుగుణంగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఇందులో భాగంగా స్కిల్ హబ్లో శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను స్కిల్ హబ్గా ఎంపిక చేసినట్లు వివరించారు. రిజిస్ట్రేషన్తో పాటు ఇతర వివరాలకు 8143576866 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
22న తిరుపతి ఐఐటీ స్నాతకోత్సవం
ఏర్పేడు : తిరుపతి ఐఐటీ 8వ స్నాతకోత్సవాన్ని ఈనెల 22వ తేదీన నిర్వహిచనున్నట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ తెలిపారు. ఆయన బుధవారం మాట్లాడుతూ ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ క్యాంపస్లో ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. ముఖ్య అతిథులుగా భారత వైమానికదళ టెస్ట్ పైలెట్, వ్యోమగామి కెప్టెన్ శుభాంశు శుక్లా, బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్మన్ సజ్జన్ జిందాల్ పాల్గొంటారని వివరించారు. స్నాతకోత్సవంలో మొత్తం 457 మంది విద్యార్థులు పట్టాలను అందుకోనున్నట్లు తెలిపారు. వీరిలో ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్ మెడల్ను బీటెక్(సీఎస్ఈ)ని అత్యధిక మార్కులతో పూర్తి చేసిన టంగుటూరి మోక్షిత్రెడ్డి ఉన్నారని వెల్లడించారు. అలాగే గవర్నర్ మెడల్ను బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థి శుభం మొహంతి, ప్రొఫెసర్ కమటం కృష్ణయ్య స్మారక అవార్డును బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ విద్యార్థిని పాలక్ ఖండేల్వాల్, వివిధ అవార్డులను మరో 15 మంది విద్యార్థులు పొందనున్నట్లు వివరించారు.
22న ఇండస్ట్రీ కనెక్ట్ డ్రైవ్
తిరుపతి అర్బన్ : తిరుపతిలోని తిలక్రోడ్ ఎస్బీబీ మెడికేర్ వద్ద ఈ నెల 22వ తేదీన ఇండస్ట్రీ కనెక్ట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకనాథం బుధవారం తెలిపారు. ఆసక్తిగల నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 18 ఏళ్ల నుంచి 35ఏళ్ల లోపు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ, ఎంపీఏ చేసినవారు అర్హులుగా పేర్కొన్నారు. ఎస్బీబీ మెడికేర్ పరిధిలో లోకల్ జాబ్స్ ఉంటాయని వెల్లడించారు. రూ.12,500 నుంచి రూ.25వేల వరకు వేతనం ఉంటుందని తెలిపారు. అర్హులైనవారు నైపుణ్యం పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 9177508279, 9347508876, 9988853335 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.


