తిరుపతి సిటీ : వికసిత్ భారత్కు దిశ, దశ చూపేది సంస్కృతమేనని కేంద్ర నాయ్యశాఖ మంత్రి అర్జున్ మేఘవాలే తెలిపారు. ఎన్ఎస్యూలో బుధవారం రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఉత్కర్ష మహోత్సవం–2026 కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. కేంద్రమంత్రి మాట్లాడుతూ సంస్కృతంలోని జ్ఞానం అర్థం చేసుకుని, సామాజిక విలువలను కాపాడాలని కోరారు. ప్రపంచంలోని శ్లోకాలు, హితవాక్యాలు రచించడం సంస్కృత గౌరవాన్ని తెలియజేస్తుందని చెప్పారు. సంస్కృతంలోని శాస్త్రాలు, ఇతర ఆధునిక విషయాలతో పరిశోధనలు ముమ్మరం చేస్తే మరింత ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని సూచించారు. అనంతరం విశ్వవిద్యాలయంలో మహా పరీక్షలో ఉత్తీర్ణత సాధించినటువంటి అద్వైత వేదాంత విద్యార్థి వరదరాజన్కు వేదాంత విధ్వన్మణి పురస్కారం ప్రదానం చేశారు. చక్కటి విద్వాంసుడిని తయారు చేసిన అద్వైత వేదాంత విభాగ ఆచార్యులు డాక్టర్ శ్రీహరి శివరాం దాయగుడేను శాస్త్ర విధ్వన్మణి బిరుదుతో సత్కరించారు. అలాగే అవధాని కేవీఎస్ఎస్, ఎస్వీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ ప్రతాప్ను అవార్డులతో సత్కరించారు. అనంతరం వర్సిటీ ప్రచురించిన 25 పుస్తకాలను ఆవిష్కరించారు. ఎన్ఎస్యూ వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి, లాల్ బహదూర్శాస్త్రి సంస్కృత వర్సిటీ వీసీ మురళీ మనోహర్ పాఠక్, రిజిస్ట్రార్ వెంకటనారాయణరావు, డీన్ రజనీకాంత్ శుక్లా, కో–ఆర్డినేటర్ గణపతిభట్, ఆచార్యులు సత్యనారాయణ, శ్రీవాత్సవ, దక్షణమూర్తి శర్మ పాల్గొన్నారు


