● రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలను గాలికి వదిలేసిన సీఎం
తిరుపతి మంగళం : చంద్రబాబు ఉద్దరిస్తాడని నమ్మి ఓట్లు వేసినందుకు ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. తిరుపతి మారుతీ నగర్లోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద శనివారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. టెట్ సమస్యపై కేంద్ర మంత్రిని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లిన ముగ్గురు టీచర్లపై సస్పెన్షన్ వేటు వేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనపై ప్రజలు, ఉద్యోగుల తిరుగుబాటు మొదలైందన్నారు.
డీఎస్సీ ఉద్యమం తీవ్ర తరం
ఢిల్లీలో నీట్ లీకేజీపై చేపట్టిన ఉద్యమం తరహాలో రాష్ట్రంలో డీఎస్సీ అవినీతిపై తీవ్రతరం చేయాలని పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు. సీఎం కుమారుడు లోకేష్ చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు కొంతమంది టీచర్లను ప్రేరేపించి తిరుగుబాటు ఉద్యమం చేయించడం చంద్రబాబు నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ప్రజలు, ఉద్యోగులు మళ్లీ వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారన్నారు. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు పోకల అశోక్కుమార్, మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు రెడ్డి ఈశ్వర్రెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిరణ్కుమార్రెడ్డి పాల్గొన్నారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న బోరు లారీ
– మహిళ మృతి, మరొకరికి తీవ్రగాయాలు
బంగారుపాళెం: మండలంలోని మొగిలి ఘాట్ వద్ద చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. బంగారుపాళెం పంచాయతీ వడ్డూరు గ్రామానికి చెందిన రాజేష్ భార్య మల్లేశ్వరి, మల్లేశ్వరి అక్క కుమారుడు విజయకుమార్ ద్విచక్రవాహనంపై కర్ణాటకలోని నంగిలిలో బంధువుల కార్యక్రమానికి వెళ్లారు. తిరిగి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వస్తుండగా మొగిలి ఘాట్ వద్ద పలమనేరు నుంచి రాగిమానుపెంట గ్రామానికి పోతున్న బోరు లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో మల్లేశ్వరి(35) సంఘటన స్థలంలోనే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన విజయకుమార్ను హైవే అంబులెన్స్ వాహనంతో సిబ్బంది చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.
చికిత్సపొందుతున్న విజయకుమార్
ప్రమాదంలో మృతి చెందిన మల్లేశ్వరి


