కార్వేటినగరం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చాక మద్యం ఏరులై పారుతూ ప్రతి గ్రామంలోనూ నిత్యావసర సరుకుల్లా బెల్టుషాపులు వెలిశాయని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి విమర్శలు గుప్పించారు. బుధవారం పుత్తూరులోని తమ నివాశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అధికారం కోసం ఎన్ని కుయుక్తులు, కుట్రలకై నా వెనుకాడడం లేదన్నారు. గతంలో ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం చేసి అధికారాన్ని చేపట్టి ప్రజల మన్ననలను పొందారని, ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఎన్నికల్లో మద్య నిషేధం చేస్తామని చెప్పి అధికారం చేజిక్కించుకున్నాక మద్యాన్ని ఏరులై పారించారని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నాశిరకమైన మద్యం అందించి ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారని అసత్య ప్రచారాలు చేసి అధికారానికి వచ్చాక.. నేడు ప్రతి పల్లెల్లోను బెల్టుషాపులు పెట్టించి ఏరులై పారించడమే కాకుండా గ్రామాల్లో విచ్చల విడిగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులే బెల్టు షాపులు, గంజాయి అమ్మకాలను ప్రోత్సాహిస్తూ తమ కార్యకర్తలతో అమ్మకాలు చేయించి దోచుకుంటున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
మహిళలపై దాడులు, అత్యాచారాలు
గంజాయి, మద్యం మత్తులో మహిళలపై దాడులు, అత్యాచారాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం లేదని, మెడికల్ విద్యార్థిపై మొన్న జరిగిన హత్యే అందుకు నిదర్శనమన్నారు. గత ప్రభుత్వం ఇళ్లు లేని పేదలకు ఒకటిన్నర సెంటు ఇంటి స్థలం ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేసి జగనన్న గ్రామాలను ఏర్పాటు చేస్తే అది కనీసం బాత్రూంకు సరిపోదని, తాను అధికారంలోకి వస్తే 3 సెంట్లు ఇచ్చి ఇంటి నిర్మాణం చేస్తానన్న చంద్రబాబు నేటికీ ఒక్క ఇల్లు ఇచ్చిన ధాఖలాలు లేవన్నారు. మాదిగల ఓట్ల కోసం ఎస్సీ వర్గీకరణ చేసి నేను పెద్దమాదిగను చెప్పిన చంద్రబాబు మాదిగలు హత్యకు గురవుతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
ఆ ప్రశ్నకు బదులేది?
పరకాల ప్రభాకర్ తన సతీమణి కేంద్ర మంత్రిగా ఉన్నా తాను ఒక భారతీయుడిగా మాట్లాడుతున్నానని.. రాత్రి ఒంటి గంట వరకు ఎక్కడైనా ఓట్లు వేస్తారా అని ప్రశ్నిస్తే ఈవీఎంల ద్వారా అధికారానికి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు సమాధానం చెప్పలేకపోతోందని అన్నారు.


