చిత్తూరు రూరల్ (కాణిపాకం): హెచ్ఐవీ నిర్ధారణ అయిన వారిని ఉచిత నిరోధక మందుల పంపిణీ కేంద్రాలకు అనుసంధానం చేసి వైద్య చికిత్స ప్రారంభించాలని జిల్లా ఎయిడ్స్ నివారణ అధికారి జి.వెంకటప్రసాద్ ఆదేశించారు. ఆయన బుధవారం జిల్లాలోని ఉచిత పరీక్షా కేంద్రాలు, లైంగిక సంక్రమిత రోగాల నివారణ కేంద్రాలు, ఉచిత మందుల పంపిణీ కేంద్రాల సలహాదారులతో త్రైమాసిక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వ్యాధి వ్యాప్తి నిరోధంలో సలహాదారుల పాత్ర కీలకమన్నారు. కేంద్రాలకు వచ్చేవారికి పరీక్షకు ముందు, పరీక్ష తర్వాత అవగాహన కల్పించాలని సూచించారు. గర్భిణులు, క్షయ వ్యాధిగ్రస్తులకు తప్పనిసరిగా రక్తపరీక్షలు చేయాలన్నారు. చికిత్స పొందుతున్న బాధితులు క్రమం తప్పకుండా మందులు వాడేలా చూడాలని, వారి వివరాలను రహస్యంగా ఉంచాలని సూచించారు. అన్ని కేంద్రాల్లో వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో ప్రజా సంబంధాల అధికారి కోటిరెడ్డి, సామాజిక సంక్షేమ అధికారి సురేంద్రబాబు, వివిధ కేంద్రాల సలహాదారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


