చిత్తూరు కలెక్టరేట్ : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సన్నా హర్షవర్ధన్ డిమాండ్ చేశారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ బుధవారం చేపట్టిన కళాశాలల బంద్ విజయవంతమైంది. బంద్కు జిల్లాలోని వివిధ కళాశాలల యాజమన్యాలు, విద్యార్థులు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. హర్షవర్ధన్ మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. చిత్తూరు సిటీ సెక్రెటరీ తేజ మాట్లాడుతూ రాష్ట్రంలో రూ.6,800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు. పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల నిలువు దోపిడీని అరికట్టాలన్నారు. ప్రభుత్వ కళాశాలలు, వసతి గృహాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.


