చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ ప్రక్రియపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఓటర్ల జాబితా సవరణ, ప్రచురణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాల్సిన కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నిబంధనలకు పాతర
కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాల ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసిన వెంటనే జిల్లాలో గుర్తించిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఓటర్ల ఫొటోలతో కూడిన ప్రింటెడ్ (హార్డ్) కాపీలను ఉచితంగా ఒక సెట్ అందజేయాల్సి ఉంటుంది. అయితే కలెక్టరేట్ విభాగం అధికారులు ఈ నిబంధనను పక్కన పెట్టేశారు. పెన్డ్రైవ్లో సాఫ్ట్ కాపీలను అందించి చేతులు దులిపేసుకున్నారు. దీనిపై వివిధ పార్టీల ప్రతినిధులు అధికారులను ప్రశ్నించగా, ఎన్నికల సంఘం నుంచి జాబితా ఇంకా రాలేదని బాధ్యతారాహిత్యంగా సమాధానమివ్వడం గమనార్హం. జాబితాల ప్రచురణ తేదీ ముందే తెలిసినప్పటికీ ప్రింటింగ్, పంపిణీ ఏర్పాట్లలో అధికారుల వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విడుదల కాని ఏఎస్డీ జాబితా
సర్ ప్రక్రియలో అత్యంత కీలకమైన అంశం ఏఎస్డీ (ఆబ్సెంటీ, షిప్టెడ్, డెడ్) ఓటర్ల పరిశీలన. వాస్తవానికి జూలై 31వ తేదీ నాటికే కలెక్టరేట్ అధికారులు ఏఎస్డీ జాబితాలను సిద్ధం చేసి బీఎల్ఓలు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేయాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా బీఎల్ఓలు క్షేత్రస్థాయికి వెళ్లి సదరు ఓటర్లకు నోటీసులు జారీచేయాల్సి ఉంటుంది. జిల్లాలో అసలు ఏఎస్డీ జాబితాలే విడుదల కాలేదు. దీంతో బీఎల్లో ఏమీ చేయలేని దుస్థితి ఏర్పడింది.
మారిన పోలింగ్ స్టేషన్లపై అయోమయం
ఇటీవల జిల్లాలో పునర్విభజన నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ కేంద్రాలను మార్చారు. ఈ మేరకు కొత్త జాబితాలను పార్టీల ప్రతినిధులకు అందించడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో ఏ పోలింగ్ కేంద్రం పరిధిలోకి ఎవరు వస్తారనే దానిపై రాజకీయ పార్టీలు, ఓటర్లలో అయోమయం తలెత్తింది.
జాబితా వివరాలు
నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
నగరి 88,762 94,047 5 1,82,814
గంగాధరనెల్లూరు 95,780 96,934 4 1,92,718
చిత్తూరు 85,820 91,256 24 1,77,100
పూతలపట్టు 99,812 1,02,616 6 2,02,434
పలమనేరు 1,20,345 1,22,599 1 2,42,945
కుప్పం 1,03,119 1,02,965 12 2,06,056
మొత్తం 5,93,638 6,10,377 52 12,04,067


