పశు వైద్యానికి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటుచేసి, పశు వైద్యానికి అన్ని రకాల మందులను సమకూర్చడంతో పాటు ల్యాబ్ పరీక్షలను అక్కడే నిర్వహించి పాడి రైతుల కష్టాలను తీర్చారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం నిర్వాకం వల్ల జిల్లాలోని 4,67,507 పాడి ఆవులు, 13,80,063 మేకలు, 4,38,362 గొర్రెలు, 1,036 గేదెలు, 5,08,808 శునకాలు.. ఇలా లక్షలాది మూగజీవాల ఆరోగ్యం గాలికి వదిలేశారు. జిల్లాలో ఒక ప్రధాన పశు వైద్యశాల, 14 ఏరియా ఆస్పత్రులు, 68 వెటర్నరీ డిస్పెన్సరీలు, 75 రూరల్ లైఫ్ స్టాక్ యూనిట్లు, 297 రైతు భరోసా కేంద్రాలు ఉన్నా.. అన్ని చోట్లా తూతూ మంత్రంగానే వైద్యం అందుతోంది.
మూలనపడ్డ ల్యాబ్లు, కిట్లు
జిల్లా వ్యాప్తంగా లక్షలాది మూగజీవాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ల్యాబ్ పరీ క్షలు పూర్తిగా మూలనపడ్డాయి. నమూనాల సేకరణ కిట్ల సరఫరాను ప్రస్తు ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. ప్రస్తుతం ఏ ఆస్పత్రిలో చూసినా కనీస పరికరాలు లేక ల్యాబ్లన్నీ ధూళి పేరుకుపోయి దర్శనమిస్తున్నాయి. ఆస్పత్రుల్లో ప్రస్తుతం టెస్ట్ ట్యూబులు, స్లైడ్స్, కవర్ స్లిప్స్, బీకర్లు, ఫ్లాస్కులు, పైపెట్లు, సీరం ట్యూబ్ల ఊసే లేదు. హిమాటలజీ కిట్లు, మూత్ర పరీక్ష కిట్లు తదితర అత్యవసర కెమికల్ కిట్ల సరఫరాను పూర్తిగా నిలిపివేయడంతో ల్యాబ్లు కేవలం నామమాత్రంగానే మిగిలాయి.
బొబ్బల
వ్యాధి
నిర్ధారణేది?
ప్రస్తుతం ఎండల తీవ్రతతో జిల్లాలో పాడి ఆవులు సొమ్మసిల్లిపోతున్నాయి. పశువులకు శరీరంపై బొబ్బలు వస్తున్నా.. అత్యంత ప్రమాదకరమైన ‘లంపీ స్కిన్’ వ్యాధి నిర్ధారణ పరీక్షలు అసలు చేయడం లేదు. దీంతో వ్యాధి తీవ్రత పెరిగి మూగజీవాలు ప్రాణాలు విడుస్తున్నాయి. మరోవైపు పశువులకు వేసే ఎర్ర సూది ధర కేవలం రూ.40 మాత్రమే అనే విషయం ఏ రైతుకూ తెలియకుండా దాచిపెడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రయివేటు ఆస్పత్రుల్లో రూ.200 నుంచి రూ.300 వరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. పైగా అవగాహన లేని సిబ్బంది ఈ సూదిని ఎప్పుడు పడితే అప్పుడు వేస్తుండడంతో మూగజీవాలకు గర్భవిచ్ఛిన్నం జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ల్యాబ్ కిట్లను సరఫరా చేయాలని, ప్రైవేట్ దోపిడీని అరికట్టాలని జిల్లా పాడి రైతులు డిమాండ్ చేస్తున్నారు.


