చిత్తూరు అర్బన్ : చిత్తూరు జిల్లా వ్యాప్తంగా శని వారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ముందస్తుగా నేరాలను నియంత్రించడంలో భాగంగా ఈ తనిఖీలు (కార్డెన్ సెర్చ్) నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగా కార్వేటినగరం మండలంలో నాటుసారా తయారీ కోసం నిల్వ చేసిన 200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అలాగే చిత్తూరు వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తు ల గురించి ఆరా తీశారు. రికార్డులు సక్రమంగా లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నేరస్తుల కదలికలపై నిఘా ఉంచడానికే కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు.
గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు
చిత్తూరు కార్పొరేషన్ : గ్రామాల అభివృద్ధికి చక్కటి ప్రణాళికలు తయారు చేసి అమలుచేయాలని పీఆర్ మంత్రిత్వశాఖ డీడీ, ఎన్ఐఆర్డీపీఆర్ బృందం సభ్యుడు సంతోషకుమార్ సిన్హా తెలిపారు. జాతీయ పంచాయతీ అవా ర్డుల కింద ప్రత్యేక కేటగిరి అవార్డులకు ఎంపిక కోసం పీఆర్ మంత్రిత్వశాఖ, ఎన్ఐఆర్డీపీఆర్ బృందం సభ్యులు క్షేత్ర స్థాయి పర్యటనకు వచ్చారు. ఇందులో భాగంగా స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం మాజీ సర్పంచులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ సర్వోత్తమ్ సంస్థాన్ పురస్కార్, అత్మనిర్భర్ స్పెషల్ పంచాయతీ అవార్డుల ఎంపికకు సంబంధించి జాబితా సిద్ధం చేసినట్టు తెలిపారు. ఆయా పంచాయతీల్లో పర్యటించి పలు అంశాలను పరిశీలించినట్టు వివరించారు. అనంతరం జెడ్పీలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కేటగిరి అవార్డులు–2026 కింద క్షేత్ర స్థాయి పరిశీలనలో భాగంగా వివిధ పంచాయతీల్లో చేసిన అభివృద్ధి పనుల ఫొటో గ్యాలరీని పరిశీలించారు. కార్యక్రమంలో ఎన్ఐఆర్డీపీఆర్ హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ అంజన్ కుమార్ భంజా, జెడ్పీ సీఈవో రవికుమార్నాయుడు, రాష్ట్ర, జిల్లా విషయ నిపుణులు తదితరులు పాల్గొన్నారు.


