
ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోధా సీఈఓ నిఖిల్ కామత్ అడిగిన ప్రశ్నకు నీతా అంబానీ సమాధానం అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది. ముంబైలోని నీతా అంబానీ ఆధ్వర్యంలో ఉన్న ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన ‘క్లాస్ ఆఫ్ 2025’ గ్రాడ్యుయేషన్ వేడుకలకు నిఖిల్ కామత్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
38 ఏళ్ల నిఖిల్ కామత్ స్టాక్ బ్రోకరేజీ సంస్థ జెరోధా సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. భారతదేశంలో అత్యంత చిన్న వయస్కుడైన బిలియనీర్లలో ఒకరిగా నిలిచారు. స్కూల్ గ్రాడ్యుయేషన్డేలో పాల్గొన్న ఆయన ప్రసంగంలో తన మొదటి ఉద్యోగం, మొదటి జీతం, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఎలా ప్రారంభించాడో తెలియజేశారు. వేడుకలో పాల్గొన్న ముఖేష్ అంబానీని ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగించాయి.
నిఖిల్ కామత్ తనకు 17 ఏళ్ల వయసులో కాల్ సెంటర్లో తొలిసారి ఫుల్టైమ్ ఉద్యోగం వచ్చిందని వెల్లడించారు. ఈ ఉద్యోగం చేస్తూనే స్టాక్స్ ట్రేడింగ్ చేసేవాడినని చెప్పారు. గతంలో స్టాక్ మార్కెట్లు ఉదయం 10 గంటలకు ఓపెన్ అయ్యేవన్నారు. ఇప్పుడు అవి ఉదయం 9 గంటలకే ప్రారంభమవుతున్నాయని చెప్పారు. తాను ఎన్నో ‘స్టాక్ మార్కెట్ మార్నింగ్స్’(మార్కెట్ ఓపెనింగ్) చూశానని చెప్పారు. అయితే ముకేశ్ భాయ్ అలాంటి మార్నింగ్స్ ఎన్ని చూశారో తనకు తెలియదన్నారు. వెంటనే నీతా అంబానీ తల అడ్డంగా ఊపుతూ చిరునవ్వులు చిందిస్తూ.. ముఖేశ్ అంబానీ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయరన్నట్లు సంకేతమిచ్చారు.
ఇదీ చదవండి: జెప్టో కేఫ్ల మూసివేత..?
ముకేశ్ భాయ్ స్టాక్ మార్కెట్లో బిజీగా ఉన్నారో లేదో తనకు కచ్చితంగా తెలియదని, కానీ భవిష్యత్తు మార్కెట్ను దాదాపు కచ్చితంగా అంచనా వేసేవారిలో ముఖేశ్ ముందుంటారని కామత్ తెలిపారు. 15 ఏళ్ల వయసులోనే చదువు మానేసి హైస్కూల్ డ్రాపవుట్గా ఉన్న తనను స్కూల్ స్నాతకోత్సవంలో ప్రసంగించమనడం విడ్డూరంగా ఉందని కామత్ అన్నారు.