గత కొంత కాలంగా.. పెరుగుతూ ఉన్న గోల్డ్ రేటు ఈ రోజు (ఏప్రిల్ 20) కొంత తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఒక శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. దీనికి కారణం ఏమిటి?, ఇతర లోహాల పరిస్థితి ఏమిటి? అనే విషయాలు ఈ కథనంలో చూసేద్దాం.
పసిడి ధరలు తగ్గడానికి ప్రధాన కారణం.. అమెరికా డాలర్ బలపడటం. సాధారణంగా డాలర్ విలువ పెరిగితే.. ఇతర కరెన్సీల్లో బంగారం కొనుగోలు చేసే వారు మరింత వెచ్చించాల్సి ఉంటుంది. కాబట్టి డిమాండ్ తగ్గి ధరలు పతనమవుతాయి.
భారతదేశంలో ఇలా..
భారతదేశంలో కీలకమైన పండుగల సమయంలో బంగారం కొనుగోళ్లు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. కానీ ఈసారి అక్షయ తృతీయ సందర్భంగా ధరలు చాలా ఎక్కువగా ఉండటంతో జువెలరీ డిమాండ్ తగ్గింది. అయితే పెట్టుబడి రూపంలో బంగారం కొనుగోలు కొంత పెరిగింది. ఇతర లోహాల విషయానికి వస్తే, వెండి ధర 1.7% తగ్గింది. ప్లాటినం, పల్లాడియం కూడా స్వల్పంగా తగ్గాయి.
ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు..
మరోవైపు.. ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు మార్కెట్లపై ప్రభావం చూపించాయి. ముఖ్యంగా అమెరికా - ఇరాన్ మధ్య శాంతి చర్చలు సరిగ్గా ముందుకు సాగకపోవడం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగడం వల్ల చమురు ధరలు పెరిగాయి. చమురు సరఫరా అంతరాయం కలగవచ్చనే భయం పెట్టుబడిదారుల్లో కనిపించింది. దీని వల్ల స్టాక్ మార్కెట్లు కూడా ఒడిదుడుకులకు లోనయ్యాయి.
అమెరికా ఒక ఇరానియన్ కార్గో షిప్ను స్వాధీనం చేసుకోవడం, దానికి ప్రతీకారం తీసుకుంటామని ఇరాన్ హెచ్చరించడం వంటి పరిణామాలు పరిస్థితిని మరింత తీవ్రం చేశాయి. ఇప్పటికే అమలులో ఉన్న తాత్కాలిక ఒప్పందం కూడా ఎక్కువకాలం నిలవకపోవచ్చనే అనుమానాలు పెరిగాయి. అంతే కాకుండా.. ఇరాన్ తదుపరి చర్చల్లో పాల్గొనబోమని ప్రకటించడం కూడా అనిశ్చితిని పెంచింది.
ద్రవ్యోల్బణ భయం!
అమెరికా ఫెడరల్ రిజర్వ్ అధికారి క్రిస్టోఫర్ వాలర్ మాట్లాడుతూ.. ఈ యుద్ధ పరిస్థితులు తాత్కాలికంగా ద్రవ్యోల్బణం పెంచవచ్చని చెప్పారు. అయితే పరిస్థితి త్వరగా సద్దుమణిగితే భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని సూచించారు.
ఇదీ చదవండి: TCS నాసిక్ కేసు: వెలుగులోకి ఊహకందని విషయాలు!


