పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో 25 శాతం బుకింగ్స్ రద్దు, రీషెడ్యూలింగ్
ఐఏటీవో వెల్లడి
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులతో అటువైపు వెళ్లాల్సిన వారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. ఫ్లయిట్లను డైవర్ట్ చేసే రిసు్కలు ఉండటం, ప్రయాణాలకు పట్టే వ్యవధిపై అనిశ్చితి నెలకొనడం, బీమా నిబంధనలపై సందేహాలు మొదలైన అంశాలు ట్రావెలర్ల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.
దీనితో 20–25% బుకింగ్స్ రద్దు లేదా రీషెడ్యూల్ అవుతున్నాయని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఐఏటీవో) వెల్లడించింది. గల్ఫ్ ట్రాన్సిట్ హబ్లు, సమీప ప్రాంతాల్లోని రూట్లకు ఇవి పరిమితమైనట్లు వివరించింది. గగనతలంపై ఆంక్షలు కొనసాగినా, పరిస్థితి మరింత తీవ్ర రూపు దాల్చినా వేసవి సీజన్లో ప్రయాణాలపై కూడా ప్రభావం పడొచ్చని ఐఏటీవో ప్రెసిడెంట్ రవి గొసెయిన్ తెలిపారు.
సమీప భవిష్యత్తులో పశ్చిమాసియా దేశాలకు, లేదా ఆ ప్రాంతం మీదుగా ఇతర దేశాలకు బుక్ చేసుకున్న వారు తమ ప్రణాళికలను వాయిదా వేసుకుంటున్నట్లు ట్రావెల్ బుకింగ్ అగ్రిగేటర్ మేక్మైట్రిప్ తెలిపింది. ఆయా ఎయిర్లైన్స్ పాలసీల ప్రకారం తేదీలను మార్చుకునే విషయంలో సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వివరించింది.
అలాగే, అబుదాబి, దుబాయ్లో ప్రస్తుతం ఉన్న ట్రావెలర్లకు స్థానిక ప్రభుత్వాలు జారీ చేసే నోటిఫికేషన్ల ఆధారంగా అప్డేట్స్ని అందిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టీ తెలిపారు. ప్రభావిత ప్రయాణికులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఒమన్ నుండి భారత్కి చార్టర్ ఫ్లయిట్స్ నడిపే యోచనలో ఉన్నట్లు వివరించారు. భౌగోళిక, రాజకీయ పరిస్థితులను బట్టి అంతర్జాతీయ ట్రావెల్కి స్వల్పకాలిక సవాళ్లు ఎదురైనా, దేశీయంగా మాత్రం టూరిజానికి డిమాండ్ పటిష్టంగానే కొనసాగవచ్చన్నారు.
చమురు భగ్గు..
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల దెబ్బతో ముడిచమురు సరఫరాపై నీలినీడలు కమ్ముకోవడంతో క్రూడాయిల్ ధరలు భగ్గుమన్నాయి. అంతర్జాతీయంగా ప్రామాణికమైన బ్రెంట్ క్రూడ్ రేటు బ్యారెల్కి 8.6 శాతం ఎగిసి 79.11 డాలర్లకు, నైమెక్స్ ఆయిల్ ధర 7.6 శాతం పెరిగి 72.12 డాలర్లకు ఎగిసింది. ప్రధాన సరఫరాదారైన ఖతర్ ఉత్పత్తి నిలిపివేయడంతో యూరప్లో సహజ వాయువు ధర 40 శాతం పైగా పెరిగింది. క్రూడాయిల్, గ్యాస్ రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిలో ట్యాంకర్ల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడటంతో రేట్లు మరింత భారీగా పెరగొచ్చనే అంచనాలు నెలకొన్నాయి.
హార్ముజ్ని పూర్తిగా మూసివేస్తే ఆయిల్ ధర 90 డాలర్లు, అటు పైన 100 డాలర్లకి కూడా ఎగియొచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే అమెరికా సహా చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతుందని విశ్లేషకులు తెలిపారు. ముడిచమురు ధరలు స్థిరంగా 15 డాలర్లు పెరిగితే, యూరప్లో ద్రవ్యోల్బణం అర శాతం మేర పెరుగుతుందని బెరెన్బర్గ్ బ్యాంక్ అంచనా వేసింది. ఈ పరిణామాలన్నీ ప్రపంచ వృద్ధిని దెబ్బతీస్తాయని పేర్కొంది. అయితే, అమెరికాలో నవంబర్లో మిడ్–టర్మ్ ఎన్నికల ముందు ప్రతికూల పరిస్థితులను ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇష్టపడకపోవచ్చు కాబట్టి ఇంధన రేట్లను మళ్లీ కిందికి దింపేందుకు ప్రయతి్నంచవచ్చని తెలిపింది.


