
న్యూఢిల్లీ: స్టీల్, అల్యూమినియం దిగుమతులపై తాము విధించిన సుంకాలు దేశ భద్రతా కోణంలోనే తప్పించి రక్షణాత్మక చర్యల కింద చూడరాదని అమెరికా కోరింది. అమెరికా జాతీయ భద్రతకు స్టీల్, అల్యూమినియం దిగుమతులు ముప్పుగా పరిణమించడంతో, దీన్ని సర్దుబాటు చేయడానికి సెక్షన్ 232 కింద అధ్యక్షుడు టారిఫ్లను ప్రకటించినట్టు వివరించింది. ఈ మేరకు ప్రపంచ వాణిజ్య సంస్థకు బదులిచ్చింది. డబ్ల్యూటీవో సేఫ్గార్డ్ అగ్రిమెంట్లోని ఆర్టికల్ 12.3 కింద అమెరికాతో సంప్రదింపులకు ఏప్రిల్ 11న భారత్ ప్రతిపాదన చేయడంతో ఈ సమాధానం వచ్చింది. ‘
‘ఇవి ఎంత మాత్రం రక్షణాత్మక చర్యలు కావు. కనుక రక్షణాత్మక చర్యల కింద సంప్రదింపులకు ఎలాంటి ప్రాతిపదిక లేదు. అయినప్పటికీ ఈ అంశమే కాదు, ఏ అంశంపై అయినా భారత్తో చర్చలకు సుముఖంగా ఉన్నాం. కాకపోతే, చర్చలు ఏవైనా కానీ రక్షణాత్మక చర్యల ఒప్పందం కింద ఉండకూడదు’’అని అమెరికా స్పష్టం చేసింది. అయితే, అమెరికా వాదనను భారత్ అంగీకరించలేదు. భద్రతా కోణంలోనే అని అమెరికా చెప్పినప్పటికీ.. అవి రక్షణాత్మక చర్యలేనని వాదించింది. ఈ ఒప్పందం కింద చర్యలను డబ్ల్యూటీవో కమిటీకి తెలియజేయడంలో అమెరికా విఫలమైనట్టు పేర్కొంది.