
8–9 శాతం వృద్ధి అంచనా
కేర్ఎడ్జ్ రేటింగ్స్ నివేదిక
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా ద్విచక్ర వాహన విక్రయాలు గణనీయంగా పెరగనున్నాయి. కొవిడ్ పూర్వ స్థాయికి మించి 8–9 శాతం మేర వృద్ధి చెందనున్నాయి. నెమ్మదిస్తున్న ద్రవ్యోల్బణం, సానుకూల వర్షపాతం తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. కేర్ఎడ్జ్ రేటింగ్స్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది.
దేశీయ టూ–వీలర్ పరిశ్రమ 2023, 2024, 2025 ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా 8 శాతం, 10 శాతం, 11 శాతం వృద్ధి చెందినట్లు వివరించింది. ఎగుమతులు 21 శాతం మేర పుంజుకోవడంతో పాటు దేశీయంగా అమ్మకాలు 9 శాతం వృద్ధి చెందడంతో 2025 ఆర్థిక సంవత్సరంలో విక్రయాల పరిమాణం గణనీయంగా పెరిగిందని కేర్ఎడ్జ్ రేటింగ్స్ తెలిపింది. ద్రవ్యోల్బణ భారం, అధిక వడ్డీ రేట్లు, కరెన్సీ కష్టాలు మొదలైన సమస్యలతో సతమతమైన కీలక మార్కెట్లలో పరిస్థితులు కాస్త మెరుగుపడటంతో ఎగుమతులు కోలుకున్నాయని వివరించింది. ఇక దేశీయంగా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పుంజుకోవడం, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ స్థిరంగా కొనసాగడం సానుకూలాంశాలుగా నిల్చాయని పేర్కొంది.
‘గత ఆర్థిక సంవత్సర పనితీరును కొనసాగిస్తూ ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ద్విచక్ర వాహనాల విక్రయాలు పటిష్టంగా వృద్ధి చెందనున్నాయి. అధిక బేస్తో పాటు నిర్దిష్ట నిబంధనలను పాటించే క్రమంలో 1–2 శాతం మేర ధరలు పెరిగినప్పటికీ 2026 ఆర్థిక సంవత్సరంలో కూడా పరిశ్రమ 8–9 శాతం వృద్ధిని సాధించే అవకాశం ఉంది‘ అని కేర్ఎడ్జ్ రేటింగ్స్ తెలిపింది. ఎగుమతుల పరిమాణం 12–14 శాతం, దేశీయంగా అమ్మకాలు స్థిరంగా 6–8 శాతం వృద్ధి చెందడం ఇందుకు దోహదపడగలదని సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ మధుసూదన్ గోస్వామి తెలిపారు.
ఇదీ చదవండి: భారతీయ కళలు ఉట్టిపడేలా నీతా అంబానీ ఆధ్వర్యంలో వేడుకలు
ఇతరత్రా ముఖ్యాంశాలు..
ఎగుమతులకు పటిష్టమైన డిమాండ్ నెలకొనడం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుండటం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుండటం, రుతుపవనాలు..ఆదాయాలపై గ్రామీణ ప్రాంతాల్లో సెంటిమెంటు మెరుగుపడుతుండటం మొదలైనవి ద్విచక్ర వాహనాల విక్రయాలకు సానుకూలాంశాలుగా నిలవనున్నాయి.
ఈ మధ్యకాలంలో రిజర్వ్ బ్యాంక్ 100 బేసిస్ పాయింట్ల మేర కీలక వడ్డీ రేటును తగ్గించడం వల్ల అఫోర్డబిలిటీ పెరుగుతుంది. డిమాండ్కి ఊతం లభిస్తుంది.
అధిక బేస్ వల్ల దేశీయంగా టూ–వీలర్ల అమ్మకాల వృద్ధి ఒక మోస్తరు స్థాయికి పరిమితం కావచ్చు. కానీ ఎగుమతులు పటిష్టంగా ఉండటం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుండటమనేది మొత్తం పరిశ్రమ స్థాయిలో అమ్మకాల పరిమాణం నిలకడగా పెరిగేందుకు దోహదపడుతుంది.
ఎగ్జిక్యూటివ్, ప్రీమియం మోటార్సైకిళ్ల సెగ్మెంటు .. ద్విచక్ర వాహనాల విక్రయ వృద్ధికి దోహదపడతాయి. గత మూడు ఆర్థిక సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ టూ–వీలర్లకు డిమాండ్ పెరుగుతుండటం వల్ల ద్విచక్ర వాహనాల విక్రయాల పరిమాణం మొత్తం మీద పెరిగింది.
2023 ఆర్థిక సంవత్సరంలో ఈ–టూవీలర్ల అమ్మకాలు 7.8 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో మొత్తం టూ–వీలర్ల విక్రయాల్లో 1.78 శాతం వాటా ఉన్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వాటా 4.38 శాతానికి పెరిగింది. తక్కువ బేస్ ఎఫెక్ట్ వల్ల వార్షికంగా 180 శాతం వృద్ధి చెందింది. ఆ తర్వాత సంవత్సరాల్లోనూ మెరుగైన వృద్ధి నమోదైంది. 2024 ఆర్థిక సంవత్సరంలో 29 శాతం పెరగ్గా, 2025లో 19 శాతం వృద్ధితో 12 లక్షల యూనిట్లకు అమ్మకాలు చేరాయి.