
బెంగళూరులో దాదాపు రెండు దశాబ్దాల క్రితం జరిగిన భూమి అమ్మకం ఇప్పుడు న్యాయ వివాదానికి దారితీసింది. 2006లో భూమిని విక్రయించిన ఓ వ్యక్తి కుమార్తె తన అనుమతి లేకుండా ఆస్తిని అమ్మారని పేర్కొంటూ ప్రస్తుత యజమానులకు లీగల్ నోటీసులు పంపింది. బృహత్ బెంగళూరు మహానగర పాలకే(బీబీఎంపీ) పరిధిలో ఉన్న ఈ ఆస్తిని మహిళ తండ్రి 19 ఏళ్ల కిందట విక్రయించాడని, ఇప్పుడు కొనుగోలుదారు తనకు నష్టపరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.
రెడ్డిట్లో భూమి కొన్న వ్యక్తి తరఫువారు తమ అనుభవాన్ని పంచుకున్నారు. ‘19 ఏళ్ల కిందట కొంత భూమిని బెంగళూరులో ఓ వ్యక్తి నుంచి కొనుగోలు చేశాం. ఆ సమయంలో తన కూతురు పెళ్లి కోసం తాను ఈ ఆస్తిని అమ్ముతున్నట్లు చెప్పాడు. పవర్ ఆఫ్ అటార్నీ (పీఓఏ) ప్రమేయం లేదు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ఆస్తి పన్నులు చెల్లిస్తున్నాం. కొనుగోలు చేసిన వ్యక్తి పేరుమీద సర్టిఫికేట్ కూడా ఉంది. 19 ఏళ్ల తర్వాత ఇప్పుడు తనను సంప్రదించలేదని ఆస్తి అమ్మిన వ్యక్తి కూతురు ఆరోపిస్తుంది. అమ్మకానికి ముందు తనను అడగలేదని, తనకు సమాచారం తెలియజేయలేదని పేర్కొంటుంది. ఆ సమయంలో తానేం మైనర్ కాదు. పైగా ఆ భూమి అమ్ముతుంది ఆమె పెళ్లి కోసమే. అయినప్పటికీ ప్రస్తుతం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఇది కుటుంబ వ్యవహారమని, సామరస్యంగా పరిష్కరిస్తామని అమ్మిన వ్యక్తి కుమారుడు తొలుత చెప్పారు. అయితే కొన్ని నెలల తర్వాత మాట మార్చి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెబుతున్నాడు. కోర్టు వెలుపల సెటిల్మెంట్ కోసం ఒత్తిడి తెస్తున్నాడు. న్యాయమూర్తి ఆమెకు అనుకూలంగా తీర్పు ఇస్తే ఏమిటి పరిస్థితి?’ అని పోస్ట్లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 61 లక్షల యూజర్లను కాపాడిన ఎయిర్టెల్
ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు, అమ్మే సమయంలో అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించి లావాదేవీలు జరపాలని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా పొరపాటు జరిగితే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందని సూచిస్తున్నారు.