న్యూఢిల్లీ: నేపాల్- భారత్ సరిహద్దు వివాదంలో నేపాల్ ప్రధాని చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఈ ద్వైపాక్షిక అంశంలో మూడో పక్షం ప్రమేయం అవసరం లేదని తేల్చిచెప్పింది. నిన్న (మంగళవారం) ఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యల చేశారు.
ఇటీవల నేపాల్ ప్రధాని బాలేంద్రషా కీలక వ్యాఖ్యలు చేశారు. నేపాల్- భారత్ సరిహాద్దు వివాదంలో చైనా, బ్రిటన్లు జోక్యం చేసుకోవాలని కోరారు. తాజాగా భారత్ దీనిపై స్పందించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ "సరిహద్దు విషయాలకు సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరించడానికి మేము ద్వైపాక్షిక యంత్రాంగాలను ఏర్పాటు చేసుకున్నాము. భారత్-నేపాల్ మధ్య ఉన్న ఈ ద్వైపాక్షిక అంశంలో మూడో పక్షానికి ఎలాంటి పాత్ర లేదనే విషయం సంబంధిత వర్గాలన్నింటికీ స్పష్టంగా అర్థం కావాలి" అని జైస్వాల్ పేర్కొన్నారు.
సరిహద్దు సమస్యకు గల కారణాలు
గండక్ నది మార్గం మారడం: 98% సరిహద్దు గుర్తింపు పూర్తయినప్పటికీ, గండక్ నది తన ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడం వల్ల కొన్ని ప్రాంతాలలో ఇంకా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు.గుర్తించబడిన సరిహద్దు ప్రాంతాలలో సరిహద్దు దాటి ఆక్రమణలు జరిగిన కేసులు ఉన్నాయి, ప్రస్తుతం వీటిని ఇరుదేశాలు కలిసి ఉమ్మడిగా మ్యాపింగ్ చేస్తున్నాయని పేర్కొన్నారు.
కైలాష్ మానససరోవర్ యాత్ర వివాదం
లిపులేఖ్ పాస్ ద్వారా భారత్ నిర్వహించ తలపెట్టిన కైలాష్ మానససరోవర్ యాత్రపై నేపాల్ గత నెలలో అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఆ ప్రాంతం ఉత్తరాఖండ్లో భాగమని భారతదేశం ఎప్పటినుంచో స్పష్టం చేస్తోంది. మే 3న దీనిపై స్పందించిన భారత్, నేపాల్ ఏకపక్షంగా సరిహద్దులను పెంచి చూపిస్తోందని దీనికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని కొట్టిపారేసింది.


