
న్యూఢిల్లీ: ప్రస్తుతం సీఏలకు మాత్రమే ఉన్న ట్యాక్స్ ఆడిటింగ్ అవకాశాన్ని తమకు కూడా కల్పించాలని కాస్ట్ అకౌంటెంట్లు కోరుతున్నారు. జీఎస్టీ చట్టంలో, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్గాను, సోషల్ ఆడిటర్లుగాను ఇద్దరికీ సమాన హోదాలనిచ్చినప్పటికీ ట్యాక్స్ ఆడిటింగ్ మాత్రం సీఏలకే పరిమితం చేయడం సమంజసం కాదని వారు పేర్కొన్నారు.
కొత్త ఆదాయ పన్ను చట్టం బిల్లులో అకౌంటెంట్ నిర్వచనంలో కాస్ట్ అకౌంటెంట్ను చేర్చకపోవడమనేది గతంలో అకౌంటింగ్ వృత్తి నిపుణులందరికీ సమాన హోదా కల్పిస్తామన్న హామీకి విరుద్ధమని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఎంఏఐ) సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడు కేసీహెచ్ఏవీఎస్ఎన్ మూర్తి తెలిపారు.
ఈ అంశంపై విధాన నిర్ణేతలతో సంప్రదింపులు జరుగుతున్నాయని మూర్తి వివరించారు. అటు అకౌంటెంట్ల నిర్వచనం పరిధిలో తమను చేర్చకపోవడంపై కంపెనీ సెక్రటరీలు ఆందోళన వ్యక్తం చేశారు.
పరోక్ష, ప్రత్యక్ష పన్ను చట్టాలపై కంపెనీ సెక్రటరీలకు కూడా పట్టు ఉంటుందని, ట్యాక్సేషన్ వ్యవస్థలో వారు కీలకంగా వ్యవహరిస్తారని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) ప్రెసిడెంట్ ధనంజయ్ శుక్లా పేర్కొన్నారు. మరోవైపు, ఆడిట్ అనేది సీఏల పరిధిలోకి మాత్రమే వస్తుందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ చరణ్జోత్ సింగ్ నందా స్పష్టం చేశారు. ఈ అంశాన్ని కోఆర్డినేషన్ కమిటీ దృష్టికి తీసుకెళ్తామని ఆయన చెప్పారు.