మీడియా రంగ దిగ్గజం, ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర ఢిల్లీలోని ప్రతిష్టాత్మక లుటియన్స్ బంగ్లా జోన్ (LBZ)లో ఉన్న తన విలాసవంతమైన బంగ్లాను రూ.1,260 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. ఈ లావాదేవీ ఇటీవల కాలంలో దేశంలో జరిగిన అత్యంత విలువైన నివాస ఆస్తి ఒప్పందాల్లో ఒకటిగా నిలిచింది.
భగవాన్ దాస్ రోడ్లో కన్నాట్ ప్లేస్, ఇండియా గేట్ సమీపంలో ఉన్న దాదాపు మూడు ఎకరాల విస్తీర్ణంలోని ఈ ఆస్తిని ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ వ్యాపార కుటుంబం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే కొనుగోలుదారుడి వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. డీల్కు సంబంధించిన తుది ప్రక్రియలు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సుభాష్ చంద్ర ఈ బంగ్లాను 2015లో సుమారు రూ.304 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పుడు రూ.1,260 కోట్లకు విక్రయించడం ద్వారా దాదాపు పదేళ్లలో ఆస్తి విలువ నాలుగు రెట్లకు పైగా పెరిగినట్లు స్పష్టమవుతోంది.
లుటియన్స్ ఢిల్లీ దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక నివాస ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుటియన్స్ రూపకల్పన చేసిన ఈ ప్రాంతంలో సుమారు 3,000 బంగ్లాలు ఉన్నాయి. కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, విదేశీ దౌత్యవేత్తలు, అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు నివసించే ఈ ప్రాంతంలో భూమి లభ్యత చాలా పరిమితంగా ఉండటంతో ఆస్తుల ధరలు ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.
కోవిడ్ అనంతరం ఢిల్లీ లుటియన్స్ జోన్లో, గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్ పరిసరాల్లో భారీ విలువ కలిగిన రియల్ ఎస్టేట్ ఒప్పందాలు పెరిగాయి. ఇటీవలే భగవాన్ దాస్ రోడ్లోని మరో 3.2 ఎకరాల రాజభవనం సుమారు రూ.1,000 కోట్లకు విక్రయమయ్యే దశకు చేరడం, అలాగే లుటియన్స్ ప్రాంతంలోని ఇతర చారిత్రక బంగ్లాలు కూడా వెయ్యి కోట్లకు పైగా ధరలు పలకడం ఈ మార్కెట్లో డిమాండ్ ఎంత బలంగా ఉందో చూపిస్తోంది.


