
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఫ్లాట్గా ముగిశాయి. బెంచ్ మార్క్ సూచీలు స్వల్ప శ్రేణిలో కన్సాలిడేట్ కావడంతో బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో వరుసగా రెండో ట్రేడింగ్ సెషన్ లోనూ స్టాక్ స్పెసిఫిక్ ట్రేడింగ్ కార్యకలాపాలు జోరందుకున్నాయి. గురువారం (మే 1) ట్రేడింగ్ హాలిడే నేపథ్యంలో ట్రేడింగ్ కార్యకలాపాలు మందకొడిగా సాగాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ 80 పాయింట్ల లాభంతో 80,371 వద్ద ప్రారంభమై, ఆ తర్వాత ట్రేడింగ్లో ఎక్కువ భాగం కన్సాలిడేట్ అయింది. ట్రేడింగ్ చివరి 30 నిమిషాల్లో 80,526 (237 పాయింట్లు పెరిగింది) వద్ద గరిష్టానికి చేరుకుంది. కాని వెంటనే లాభాలను కోల్పోయి 79,879 వద్ద కనిష్టానికి పడిపోయింది. రోజులో గరిష్ట స్థాయి నుండి 647 పాయింట్లు పడిపోయింది. చివరకు సెన్సెక్స్ 46 పాయింట్ల నష్టంతో 80,0242 వద్ద ముగిసింది. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 2,827 పాయింట్లు (3.6 శాతం) లాభంతో ఏప్రిల్ నెలను ముగించింది.
ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ దాదాపు 200 పాయింట్ల రేంజ్లో కదలాడింది. 24,396 వద్ద గరిష్టాన్ని తాకింది. తరువాత 24,199 వద్ద కనిష్టానికి పడిపోయింది. చివరకు రెండు పాయింట్ల నష్టంతో 24,334 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఏప్రిల్ నెలలో 3.5 శాతం లేదా 815 పాయింట్లు లాభపడింది.
సెన్సెక్స్ 30 స్టాక్స్లో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు 5 శాతానికి పైగా నష్టపోయాయి. టాటా మోటార్స్, ఎస్బీఐ 3 శాతం చొప్పున నష్టపోయాయి. అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్ షేర్లు కూడా నష్టపోయాయి. మారుతీ మాత్రం 3 శాతానికి పైగా లాభపడింది. భారతీ ఎయిర్టెల్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు కూడా 1 - 2 శాతం చొప్పున లాభపడ్డాయి.
కాగా విస్తృత సూచీలు గణనీయ నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ 1 శాతం, స్మాల్ క్యాప్ 2 శాతం పడిపోయాయి. మొత్తంగా మార్కెట్ విస్తృతి చాలా ప్రతికూలంగా ఉంది. బీఎస్ఈలో పురోగమిస్తున్న ప్రతి షేరుకు దాదాపు 3 స్టాక్స్ క్షీణించాయి. రంగాలవారీగా చూస్తే బీఎస్ఈ పవర్, క్యాపిటల్ గూడ్స్ సూచీలు 1 శాతానికి పైగా నష్టపోయాయి. రియాల్టీ 1 శాతానికి పైగా లాభపడింది. బుధవారం ఇంట్రాడేలో రియల్టీ ఇండెక్స్ 4 శాతం పెరిగింది.