తప్పుడు టికెట్‌ ఇచ్చి తిప్పలు పెడతారా? ఎయిర్‌లైన్‌కు జరిమానా | SpiceJet To Pay Rs 25,000 Compensation To Passenger For Wrong Ticket, Check Out Full Story Inside | Sakshi
Sakshi News home page

తప్పుడు టికెట్‌ ఇచ్చి తిప్పలు పెడతారా? ఎయిర్‌లైన్‌కు జరిమానా

Jun 22 2025 4:24 PM | Updated on Jun 22 2025 5:21 PM

SpiceJet to Pay Rs 25000 for Wrong Ticket

ప్రయాణికుడికి తప్పుడు విమాన టికెట్‌ ఇచ్చి ఇబ్బందులకు గురి చేసిన ఎయిర్‌లైన్‌ సంస్థ స్పైస్ జెట్‌కు వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. స్పైస్ జెట్ తప్పుడు టికెట్లు జారీ చేయడంతో ఓ సీనియర్ సిటిజన్ ఆర్థికంగా, మానసికంగా నష్టపోయాడని, ఆ ప్రయాణికుడికి రూ.25,000 నష్టపరిహారం చెల్లించాలని వినియోగదారుల కమిషన్ ఆదేశించింది.

ముంబై (సబర్బన్) జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ జూన్ 17న జారీ చేసిన ఉత్తర్వులలో ప్రయాణికుడిని "మానసిక వేధింపులకు" గురిచేసిన సంఘటనలో "లోపభూయిష్టమైన సేవ, నిర్లక్ష్య ప్రవర్తన"కు స్పైస్ జెట్‌ను వినియోగదారుల కమిషన్ దోషిగా పేర్కొంది.

వివరాల్లోకి వెళ్తే.. ఘట్కోపర్ ప్రాంతంలో నివసిస్తున్న సీనియర్ సిటిజన్ 2020 డిసెంబర్ 5న ముంబై నుండి దర్భంగాకు స్పైస్‌ జెట్‌లో రానూపోనూ  టికెట్లను బుక్ చేసుకున్నారు. ముంబై-దర్భంగా ప్రయాణం పూర్తి కాగా, ప్రతికూల వాతావరణం కారణంగా తిరుగు ప్రయాణాన్ని విమానయాన సంస్థ రద్దు చేసింది. 2020 డిసెంబర్ 8న ముంబైలో పీహెచ్‌డీ ఆన్‌లైన్ పరీక్షకు హాజరు కావాల్సి ఉన్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రయాణికుడు కోరగా అదే రోజు పాట్నా నుంచి కోల్‌కతాకు, అక్కడి నుంచి ముంబైకి ప్రయాణించేందుకు స్పైస్‌జెట్ ప్రత్యామ్నాయ టికెట్‌ అందించింది.

అయితే తీరా పాట్నాకు చేరుకున్న తర్వాత ఆ టికెట్లు తప్పుగా ఉన్నాయని విమానాశ్రయ అధికారులు తెలియజేశారు. దీంతో ప్రయాణికుడు మరుసటి రోజు ఉదయం తన సొంత ఖర్చులతో మరో విమానాన్ని బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఇది ఆయనకు మానసిక వేదనతోపాటు ఆర్థిక నష్టాన్ని కలిగించింది. ఇలాంటి పరిస్థితుల్లో ముంబైకి ఆలస్యంగా రావడం వల్ల ఆయన పరీక్షకు కూడా రాయలేకపోయారు.

ఇదంతా విమానయాన సంస్థ సేవల్లో లోపం, నిర్లక్ష్యం వల్లే జరిగిందంటూ సదరు వ్యక్తి వినియోగదారుల ప్యానెల్ ను ఆశ్రయించారు. రూ.14,577 ఛార్జీ మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని, మానసిక వేదనకు గురిచేసినందుకు రూ.2 లక్షలు, లిటిగేషన్ ఖర్చు కింద రూ.25 వేలు స్పైస్‌ జెట్‌ నుంచి ఇప్పించాలని కోరారు.

అయితే ప్రతికూల వాతావరణం కారణంగా విమాన రద్దు జరిగిందని, దీనికి తమ బాధ్యత పరిమితమని స్పైస్ జెట్ వాదించింది. అదనపు ఛార్జీలు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, బుకింగ్ ఏజెన్సీ ద్వారా ఫిర్యాదుదారుడికి పూర్తి టికెట్ మొత్తాన్ని తిరిగి చెల్లించామని ఎయిర్‌లైన్స్ పేర్కొంది.

దీనిపై వినియోగదారుల కమిషన్ స్పందిస్తూ విమానాల రద్దు విమానయాన సంస్థ నియంత్రణకు అతీతమైనదని అంగీకరిస్తూనే ఫిర్యాదుదారుకి తప్పుడు టికెట్లు జారీ చేసిన నిర్లక్ష్య చర్య నుంచి విమానయాన సంస్థ తప్పించుకోజాలదని స్పష్టం చేసింది. ప్రయాణికుడికి మానసిక వేదనకు పరిహారంగా రూ .25,000, లిటిగేషన్ ఖర్చు కోసం రూ .5,000 చెల్లించాలని కమిషన్ విమానయాన సంస్థను ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement