పట్టణాలకు దగ్గరగా ఉన్న భూములకు పరిహారం తగ్గింపు
హైకోర్టు తీర్పు పేరుతో రైతులకు నష్టం చేసేలా ముసాయిదా నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: భూ సేకరణలో పట్టణాలకు దగ్గరగా భూములు కోల్పోతున్న రైతులకు చంద్రబాబు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ భూములకు గతంలో కంటే భారీగా పరిహారం తగ్గించింది. భూసేకరణ చట్టం–2013 కింద పరిహారం లెక్కింపులో కీలకమైన నిబంధనను సవరిస్తూ బుధవారం జీవో 470 జారీ చేసింది. ప్రభుత్వం భూమిని సేకరించినప్పుడు మార్కెట్ విలువే కాకుండా దానిపై అదనంగా కొంత శాతం కలిపి ఇస్తారు. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో (షెడ్యూల్డ్ ఏరియాలు మినహా) భూమిని సేకరిస్తే ఈ అదనపు పరిహారం 25 శాతంగా (మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 1.25) ఉంది. అంటే రూ.10 లక్షల విలువైన భూమికి రైతుకు రూ.10 లక్షలతోపాటు అదనంగా రూ.2.5 లక్షలు లభించేవి.
ఇప్పుడు ప్రభుత్వం ఈ 25 శాతాన్ని అందరికీ ఒకేలా ఇవ్వకుండా కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల నుంచి ఆ భూమి ఎంత దూరంలో ఉందన్న దాన్ని బట్టి మూడు స్థాయిలుగా విభజించింది. పట్టణానికి 2 కిలోమీటర్ల లోపు ఉన్న భూములకు కేవలం 5 శాతం (మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 1.05) అదనంగా ఇవ్వనున్నారు. 2–5 కిలోమీటర్ల మధ్య ఉన్న భూములకు 10 శాతమే(మల్టిప్లికేషన్ 1.10) లభిస్తుంది. 5 కిలోమీటర్లు దాటిన భూములకు మాత్రమే 25 శాతం(మల్టిప్లికేషన్ 1.25) కొనసాగుతుంది. ఉదాహరణకు రూ.10 లక్షల విలువ ఉన్న భూమిని తీసుకుంటే పట్టణానికి దగ్గరగా ఉన్న రైతుకు ఇప్పుడు కేవలం రూ.10.5 లక్షలే వస్తాయి.
నగర, పట్టణ శివారు భూముల విలువ ఎక్కువగా ఉంటుంది. అలాంటి కీలకమైన భూములకే ఇప్పుడు ప్రభుత్వం అదనపు పరిహారంలో కోత పెట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలానికి చెందిన కాశీరాజు సీతారామయ్య, మరో 82 మంది రైతులు తమ భూములకు తక్కువ మల్టిప్లికేషన్ వర్తింపజేశారని, పోరంకి రైతులకు ఇచ్చినంత పరిహారం తమకు ఇవ్వలేదని 2017లో హైకోర్టును ఆశ్రయించారు. 2019లో హైకోర్టు వీరికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పు ఆధారంగానే సవరణ తెచ్చినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. ఆ తీర్పు రైతులకు ఎక్కువ పరిహారం ఇవ్వాలని చెబితే ప్రభుత్వం మాత్రం పట్టణాలకు దగ్గరగా ఉన్న భూములకు పరిహారాన్ని తగ్గించేలా నిబంధన మార్చింది. దీనిపై 15 రోజుల్లోగా అభ్యంతరాలు, సలహాలు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.


