నేడు ప్రతికూల ఓపెనింగ్?!
ఎస్జీఎక్స్ నిఫ్టీ 37 పాయింట్లు మైనస్
నిఫ్టీకి 11,464-11,406 వద్ద సపోర్ట్స్
యూఎస్ మార్కెట్లు 0.2-1.2 శాతం అప్
ప్రస్తుతం ఆసియా మార్కెట్లు మిశ్రమం
ఇన్వెస్ట్మెంట్స్ బాటలోనే ఎఫ్పీఐలు
నేడు(16న) దేశీ స్టాక్ మార్కెట్లు ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ 37 పాయింట్లు క్షీణించి 11,497 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ 11,534 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. టెక్నాలజీ షేర్ల అండతో మంగళవారం మళ్లీ యూఎస్ మార్కెట్లు 0.2-1.2 శాతం బలపడగా.. ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. చైనాతో సరిహద్దు వివాదాలపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో మార్కెట్లు నేడు యథాప్రకారం ఒడిదొడుకులకు లోనుకావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
సెన్సెక్స్@ 39,000
ప్రధానంగా ప్రయివేట్ బ్యాంక్స్, ఫార్మా దిగ్గజాలకు డిమాండ్ నెలకొనడంతో మంగళవారం దేశీ స్టాక్ మార్కెట్లు ఇంట్రాడే గరిష్టాల వద్దే నిలిచాయి. సెన్సెక్స్ 288 పాయింట్లు బలపడి 39,000 ఎగువన 39,044 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 82 పాయింట్లు ఎగసి 11,522 వద్ద ముగిసింది. అయితే ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,754 దిగువన కనిష్టాన్ని చవిచూడగా.. నిఫ్టీ ఒక దశలో 11,442 వరకూ నీరసించింది.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 11,464 పాయింట్ల వద్ద, తదుపరి 11,406 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,558 పాయింట్ల వద్ద, ఆపై 11,594 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 22,181 పాయింట్ల వద్ద, తదుపరి 21,896 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 22,633 పాయింట్ల వద్ద, తదుపరి 22,799 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి అవరోధాలు కనిపించవచ్చని భావిస్తున్నారు.
ఎఫ్పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1,171 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 896 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్పీఐలు రూ. 298 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 120 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.
మరిన్ని వార్తలు