‘ఐసీఐసీఐ నుంచి వేతనం తీసుకున్న సెబీ చీఫ్‌’ | SEBI Chairperson Madhabi Puri drawn over Rs 12 crore in salary from ICICI Bank between 2017-2024 | Sakshi
Sakshi News home page

‘ఐసీఐసీఐ నుంచి వేతనం తీసుకున్న సెబీ చీఫ్‌’

Sep 2 2024 4:03 PM | Updated on Sep 2 2024 4:10 PM

SEBI Chairperson Madhabi Puri drawn over Rs 12 crore in salary from ICICI Bank between 2017-2024

సెబీ ఛైర్‌పర్సన్ మాధబిపురి బుచ్‌పై కాంగ్రెస్ పార్టీ సోమవారం తీవ్ర ఆరోపణలు చేసింది. ఆమె 2017 నుంచి 2024 మధ్య ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.12 కోట్లకు పైగా వేతనం తీసుకున్నారని కాంగ్రెస్‌ ప్రతినిధి పవన్ ఖేరా తెలిపారు. ప్రముఖ సంస్థకు చీఫ్‌గా వ్యవహరిస్తూ వేరే సంస్థ నుంచి వేతనం తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమన్నారు.

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చీఫ్‌ మాధబి ఐసీఐసీఐ బ్యాంకుతో పాటు 2017-24 మధ్య కాలంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నుంచి రూ.22.41 కోట్ల ఆదాయాన్ని పొందారని ఖేరా తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.రెండు కోట్లకు పైగా విలువైన ఇఎస్‌ఓపీని అందుకున్నారని చెప్పారు. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై సెబీ చీఫ్‌​ సరైన విచారణ నిర్వహించకపోవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: మెరుగైన మౌలిక సదుపాయాలతో దేశం వృద్ధి

అసలేం జరిగిందంటే..

బెర్ముడా, మారిషస్‌ల్లోని అదానీ గ్రూప్‌ డొల్ల కంపెనీల్లో మాధబీ దంపతులకు వాటాలున్నట్టు ఇటీవల విడుదల చేసిన తాజా నివేదికలో హిండెన్‌బర్గ్‌ వెల్లడించింది. ఆ కంపెనీల్లో వారిద్దరూ కోటి డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టినట్టు నివేదిక తెలిపింది. భారత్‌లో పెట్టుబడులకు ఎన్నో మ్యూచువల్‌ ఫండ్లు తదితరాలుండగా ఏరి కోరి పన్ను ఎగవేతదారుల స్వర్గధామంగా పేరొందిన దేశాల్లో, అదీ అదానీలకు చెందిన డొల్ల కంపెనీల్లోనే పెట్టడం ఆశ్చర్యకరమని పేర్కొంది. అదానీల ఆర్థిక అవకతవకల్లో ఏకంగా సెబీ చీఫే భాగస్వామి కావడంతో లోతుగా విచారణ జరిపేందుకు సెబీ వెనకడుగు వేసిందని ఆరోపించింది.

Advertisement
 
Advertisement
Advertisement