
ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2024–25) ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. నికర లాభం రెట్టింపునకుపైగా జంప్చేసి రూ. 509 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2023–24) కేవలం రూ. 240 కోట్లు ఆర్జించింది.
స్థూల ప్రీమియం ఆదాయం(జీడబ్ల్యూపీ) సైతం 11 శాతం ఎగసి రూ. 14,140 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది రూ. 12,731 కోట్ల జీడబ్ల్యూపీ సాధించింది. కంపెనీ సాల్వెన్సీ రేషియో ఆర్థిక పటిష్టతను సూచిస్తూ 2ను మించింది. నిబంధనల ప్రకారం 1.5 నిష్పత్తిని మించింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐకు సాధారణ బీమా రంగ అనుబంధ సంస్థ ఇది.
హెల్త్ ఇన్సూరెన్స్ విభాగం 19.2 శాతం, మోటార్ ఇన్సూరెన్స్ 31.2 శాతం వృద్ధిని నమోదు చేసుకోవడంతో కంపెనీ పటిష్టమైన పనితీరు కనబరిచింది. మెరైన్ కార్గో, ఇంజినీరింగ్, కమర్షియల్ లైన్స్ సహా ఇతర విభాగాలు కూడా బీమా కంపెనీ వృద్ధికి ఊతమిచ్చాయి.
ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈఓ నవీన్ చంద్ర ఝా మాట్లాడుతూ ‘2025 ఆర్థిక సంవత్సరం పనితీరు కస్టమర్ సర్వీస్, వృద్ధి, లాభదాయకత పట్ల మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. జీడబ్ల్యూపీ వృద్ధి 11.1 శాతం, పీఏటీలో 2.1 రెట్లు పెరుగుదలతో, మేము మార్కెట్ కంటే వేగంగా అభివృద్ధి చెందుతున్నాం’ అన్నారు.