
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన రుణ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఆర్బీఐ రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో ఎస్బీఐ కూడా రుణ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రేట్ల కోత జూన్ 15 నుంచి అమలులోకి వస్తుందని, ప్రస్తుత రెపో లింక్డ్ రుణాలు, కొత్త రుణగ్రహీతలకు వర్తిస్తుందని ఎస్బీఐ పేర్కొంది.
వారం రోజుల క్రితం ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ పాలసీ రెపో రేటులో సగం శాతం తగ్గింపునకు అనుగుణంగా ఎస్బీఐ ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేటు (ఈబీఎల్ఆర్), గృహ రుణ రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు తెలిపింది. ఈ తగ్గింపు తర్వాత ఈబీఎల్ఆర్ 8.65 శాతం నుంచి 8.15 శాతానికి తగ్గింది.
రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత బ్యాంక్ ఆఫ్ బరోడా, మూడవ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, యుకో బ్యాంక్ వంటివి ఇప్పటికే రుణ రేట్లను తగ్గించాయి. ఎందుకంటే రెపో రేటుతో లింక్ అయిన లేదా ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లింక్డ్ రుణాలుగా పిలిచే, ఫ్లోటింగ్ రేట్లలో ఉన్న రుణాలకు రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు తగ్గించిన వెంటనే కాకపోయినా, వచ్చే నెల మొదటి రోజు నాటికి రెపో తగ్గింపును ప్రస్తుత రుణగ్రహీతలకు బదిలీ చేయాల్సి ఉంటుంది.