ఆహార ధరలు మరింత తగ్గాయ్‌..! | Retail inflation eases to over six-year low of 2. 82percent in May 2025 | Sakshi
Sakshi News home page

ఆహార ధరలు మరింత తగ్గాయ్‌..!

Jun 13 2025 4:23 AM | Updated on Jun 13 2025 8:03 AM

Retail inflation eases to over six-year low of 2. 82percent in May 2025

ఆరేళ్ల కనిష్టానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం 

మే నెలకు 2.82 శాతంగా నమోదు

న్యూఢిల్లీ: ధరలు మరింత దిగొచ్చాయి. మే నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏకంగా ఆరేళ్ల కనిష్ట స్థాయి అయిన 2.82 శాతానికి తగ్గింది. 2019 ఫిబ్రవరిలో 2.57 శాతం తర్వాత తిరిగి కనిష్టానికి దిగి రావడం ఇదే మొదటిసారి. వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (సీపీఐ/రిటైల్‌) ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో 3.16 శాతంగా ఉంటే, 2024 మే నెలలో 4.8 శాతంగా ఉండడం గమనార్హం. ముఖ్యంగా ఆహార ధరల విభాగంలో ద్రవ్యోల్బణం 0.99 శాతానికి పరిమితమైంది. 

ఏడాది క్రితం ఇదే నెలలో ఇది 8.69 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిలో కట్టడి చేయాలన్నది ఆర్‌బీఐ లక్ష్యం. ఈ స్థాయికి దిగువనే ఉండడం సానుకూలించే అంశం. ఈ అంచనాల నేపథ్యంలోనే ఆర్‌బీఐ ఈ నెల ఆరంభంలో రెపో రేటును ఏకంగా అర శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. 

‘‘పప్పులు, వాటి సంబంధిత ఉత్పత్తులు, కూరగాయలు, పండ్లు, ధాన్యం ఉత్పత్తులు, గృహ వినియోగ వస్తువులు, సేవల ద్రవ్యోల్బణం తగ్గడం మే నెలలో ఆహార, రిటైల్‌ ద్రవ్యోల్బణం దిగిరావడానికి దోహదపడింది’’అని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) ప్రకటించింది. ఆహార ద్రవ్యోల్బణం 2021 అక్టోబర్‌ తర్వాత కనిష్ట స్థాయిలో నమోదైనట్టు తెలిపింది. 

పట్టణాల్లో కాస్త ఎక్కువ..: మే నెలలో గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 2.59 శాతానికి పరిమితం అయితే.. పట్టణ ప్రాంతాల్లో ఇది 3.07 శాతంగా ఉంది. ముఖ్యంగా దేశంలోనే అతి తక్కువ ద్రవ్యోల్బణం తెలంగాణలో నమోదైంది. 0.55 శాతంగా ఉంది. కాగా, అత్యధికంగా కేరళలో 6.46 శాతం రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదైంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement