3.9 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: రిటైల్ ధరలు మే నెలలో మరికొంత ఎగిశాయి. వినియోగ ధరల ఆధారిత సూచీ (సీపీఐ/రిటైల్ ద్రవ్యోల్బణం) ఏప్రిల్లో ఉన్న 3.48 శాతం నుంచి 3.93 శాతానికి పెరిగింది. ఆహార ధరలు, ఇంధన ధరలు ఈ పెరుగుదలకు దోహదం చేసినట్టు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్త్నుాయి.
→ ఆహార విభాగంలో సీపీఐ ఏప్రిల్లో 4.2 శాతంగా ఉంటే, మేలో 4.78 శాతానికి పెరిగింది.
→ మేలో పసిడి, వెండి ఆభరణాలు, టమాటోలు, అల్లం, కిస్మిస్ ధరలు అధికంగా పెరిగాయి.
→ ఆలుగడ్డలు, బఠానీ, మోటారు కార్లు, జీలకర్ర, మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరలు తగ్గాయి.
→ మే నుంచి చూస్తే పెట్రోల్ ధర 7.4 శాతం, డీజిల్ ధర రూ.8.4 శాతం చొప్పున పెరగడం తెలిసిందే.
→ పట్టణాల్లో ద్రవ్యోల్బణం తక్కువగా 3.93 శాతంగా ఉంటే, పల్లెల్లో 4.25 శాతంగా నమోదైంది.
→ దేశంలో అత్యధికంగా తెలంగాణలోనే 6.15 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. మిజోరంలో అత్యల్పంగా 1.03 శాతం ఉంది.
→ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.1 శాతంగా ఉండొచ్చంటూ ఆర్బీఐ ఎంపీసీ ఇటీవలి సమీక్ష అనంతరం ప్రకటించడం తెలిసిందే.
ఆహారంతోపాటు, ఆహారేతర వస్తువుల ధరలు పెరగడం ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపించినట్టు క్రిసిల్ ముఖ్య ఆర్థికవేత్త దీప్తి దేశ్పాండే తెలిపారు. ‘‘తయారీదారులకు ముడిసరుకుల ధరలు ప్రియంగా మారాయి. టోకు ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 8.3 శాతానికి చేరడం ఇదే సూచిస్తోంది. ఇప్పుడు ఈ భారం రిటైల్ ధరలపైనా క్రమంగా ప్రతిఫలిస్తోంది’’అని చెప్పారు. రానున్న రోజుల్లో ఆర్బీఐ లకి‡్ష్యత పరిధిలోనే (2–6 శాతం) ద్రవ్యోల్బణం ఉండొచ్చని అసోచామ్ ప్రెసిడెంట్ నిర్మల్ కే మిండా అంచనా వేశారు.


