
కస్టమర్లకు తగినంత సమయం ఇవ్వండి
బ్యాంక్లకు ఆర్బీఐ తాజా ఆదేశాలు
బిజినెస్ కరస్పాడెంట్లకు అనుమతి
ముంబై: కాలానుగుణంగా కేవైసీ అప్డేషన్ను మరింత సులభతరం చేసే దిశగా ఆర్బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. కేవైసీ అప్డేషన్ సేవలను బిజినెస్ కరస్పాడెంట్ల ద్వారా (బీసీలు) చేపట్టేందుకు అనుమతించింది. కస్టమర్లకు నిర్ణిత గడువుతో ముందస్తు నోటీసులు/సమాచారం ఇవ్వాలంటూ బ్యాంక్లతోపాటు తన నియంత్రణల పరిధిలోని ఆర్థిక సంస్థలను (ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలు తదితర) ఆర్బీఐ కోరింది. ‘‘ఖాతాల కేవైసీ అప్డేషన్ విషయంలో పెద్ద ఎత్తున పెండింగ్ ఉన్నట్టు గమనించాం.
ముఖ్యంగా ప్రత్యక్ష నగదు బదిలీ కోసం, స్కాలర్ షిప్ ప్రయోజనాల కోసం తెరిచిన ఖాతాలు, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) ఖాతాల విషయంలో ఈ పరిస్థితి నెలకొంది’’అని ఆర్బీఐ ఆదేశాల్లో పేర్కొంది. కస్టమర్ల సౌకర్యం దృష్ట్యా బిజినెస్ కరస్పాడెంట్ల (బీసీలు)ను కేవైసీ అప్డేషన్ పనుల నిర్వహణకు అనుమతిస్తున్నట్టు తెలిపింది. దీంతో గ్రామీణ ప్రాంతాలు, బ్యాంక్ శాఖలు అంతగా అందుబాటులో లేని ప్రాంతాల కస్టమర్లకు సైతం కేవైసీ అప్డేషన్ సులభతరం కానుంది. ఇందుకు వీలుగా సవరించిన కేవైసీ ఆదేశాలను జారీ చేసింది.
3 పర్యాయాలు సమాచారం ఇవ్వాల్సిందే..
కాలానుగుణ కేవైసీ అప్డేషన్ విషయంలో కస్టమర్లకు బ్యాంక్లు ముందస్తు నోటీసులు ఇవ్వడం తప్పనిసరి. కనీసం మూడు పర్యాయాలు కస్టమర్లకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ఒక్కసారి లేఖ ద్వారా తెలియజేయాలని ఆర్బీఐ పేర్కొంది. ప్రతి ఇంటిమేషన్/రిమైండర్ను నమోదు చేయాలని కూడా ఆదేశించింది. కేవైసీ వివరాల్లో ఎలాంటి మార్పు లేకపోతే కస్టమర్ నుంచి స్వీయ ధ్రువీకరణ తీసుకుంటే సరిపోతుంది. తక్కువ రిస్క్ లో ఉన్న కస్టమర్లు గడువులోపు కేవైసీ అప్డేట్ చేయకపోయినప్పటికీ.. అప్పటి నుంచి ఏడాది పాటు లేదా 2026 జూన్ 30 వరకు వారి ఖాతాల్లో అన్ని లావాదేవీలను అనుమతించాలని
ఆర్బీఐ కోరింది. కేవైసీ అప్డేషన్ విషయంలో క్యాంపులు నిర్వహించి కస్టమర్లలో అవగాహన కల్పించాలని సూచించింది.