డబ్బు సంపాదించడం, దాన్ని పొదుపు చేయడం, ఆ తర్వాత పెట్టుబడి పెట్టడం.. సాధారణంగా మనం సంపదను పెంచుకునే విధానం ఇదే. కానీ ప్రముఖ రచయిత, 'రిచ్ డాడ్, పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి మాత్రం డబ్బు, అప్పులు, పెట్టుబడుల విషయంలో కొంచెం భిన్నంగా ఆలోచిస్తారు. ఆయన అభిప్రాయం ప్రకారం.. అప్పు తీసుకోవడం అనేది అన్ని వేళలా చెడ్డ విషయం కాదు. ఆ అప్పును సరైన విధంగా ఉపయోగించి ఆదాయం తెచ్చే ఆస్తులను కొనుగోలు చేస్తే.. అదే అప్పు సంపదను పెంచే సాధనంగా మారవచ్చని చెబుతున్నారు.
అప్పు ఎప్పుడూ చెడ్డది కాదు!
సాధారణంగా అప్పు అంటే మనకు ఆర్థిక భారం అనే భావన ఉంటుంది. అయితే.. కియోసాకి మాత్రం అప్పును దేనికోసం ఉపయోగిస్తున్నామనే కోణంలో చూడాలని చెబుతున్నారు. మన దగ్గర నుంచి డబ్బును తీసుకెళ్లే వస్తువుల కోసం తీసుకునే అప్పు ఒక రకం అయితే.. భవిష్యత్తులో ఆదాయం తెచ్చే ఆస్తులను కొనుగోలు చేయడానికి తీసుకునే అప్పు మరో రకం.
ఉదాహరణకు అద్దె వంటి ఆదాయం వచ్చే ఒక ప్రాపర్టీని కొనడానికి లోన్ తీసుకున్నామని అనుకుందాం. ఆ ప్రాపర్టీ నుంచి వచ్చే అద్దె ద్వారా కొంతవరకు లోన్ చెల్లించవచ్చు. భవిష్యత్తులో ఆ ప్రాపర్టీ విలువ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి పెట్టుబడిని కియోసాకి సంపదను సృష్టించే మార్గంగా చూస్తారు.
అదే సమయంలో.. ఆదాయం తీసుకురాని ఖరీదైన వస్తువుల కోసం భారీగా అప్పు చేస్తే, అది మనపై ఆర్థిక భారాన్ని పెంచుతుంది. అందుకే అప్పు తీసుకున్నామా లేదా అన్నదానికంటే, ఆ అప్పును ఎక్కడ ఉపయోగిస్తున్నాం అనేదే ముఖ్యమని కియోసాకి చెబుతారు.
ఫెరారీ, రోల్స్ రాయిస్ కూడా లయబిలిటీలే
కియోసాకి తన వద్ద ఉన్న ఫెరారీ, రోల్స్ రాయిస్ వంటి లగ్జరీ కార్లను ఉదాహరణగా చెబుతారు. అవి పూర్తిగా చెల్లించేసిన వాహనాలే అయినప్పటికీ.. తన దృష్టిలో అవి ఆస్తులు కావని, లయబిలిటీలని ఆయన అంటారు.
దీనికి కారణం చాలా సింపుల్. ఒక కారు మనకు ఆదాయం తీసుకురాకపోతే.. దాని కోసం ఇంధనం, ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్ వంటి ఖర్చులు చేయాల్సి ఉంటుంది. అంటే.. ఆ కారు మన జేబులోకి డబ్బు తీసుకురావడం కంటే.. మన దగ్గర నుంచి డబ్బును తీసుకుంటుంది. కియోసాకి చెప్పే ఆస్తి, లయబిలిటీ మధ్య తేడా ఇదే.
డబ్బుపై కంటే బంగారం, వెండిపై నమ్మకం
కియోసాకి అమెరికా డాలర్ విషయంలో కూడా చాలాకాలంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 1971లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ కాలంలో డాలర్ను బంగారంతో అనుసంధానించే విధానం ముగిసిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తుంటారు.
అందుకే.. తన సంపాదనలో కొంత భాగాన్ని నగదుగా ఉంచుకోవడం కంటే బంగారం, వెండి వంటి విలువైన లోహాల్లో పెట్టుబడి పెట్టడానికి ప్రాధాన్యం ఇస్తానని చెబుతారు. ద్రవ్యోల్బణం కారణంగా కాలక్రమంలో నగదు కొనుగోలు శక్తి తగ్గే అవకాశం ఉందని భావించే కియోసాకి.. బంగారం, వెండిని దీర్ఘకాలిక ఆస్తులుగా చూస్తారు.
1.2 బిలియన్ డాలర్ల అప్పు ఎందుకు?
కియోసాకి తనపై సుమారు 1.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.11 వేలకోట్లు) అప్పు ఉందని కొన్ని సందర్భాల్లో వెల్లడించారు. ఈ విషయం వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా.. ఆ అప్పును తాను ఆస్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగించానని వివరించారు. అంటే ఆయన వ్యూహం ప్రకారం.. బ్యాంకు నుంచి డబ్బు తీసుకుని, ఆ డబ్బుతో ఆదాయం తెచ్చే ఆస్తులను కొనుగోలు చేయాలి. ఆ ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం ద్వారా సంపదను పెంచుకోవాలి. ఈ విధానాన్ని ఆయన పెట్టుబడుల్లో 'లీవరేజ్'గా చూస్తారు.
అయితే.. ఇలాంటి వ్యూహంలో రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పెట్టుబడి విలువ తగ్గినా, ఆదాయం అనుకున్నంతగా రాకపోయినా.. అప్పు మాత్రం చెల్లించాల్సిందే. కాబట్టి కియోసాకి విధానం ప్రతి ఒక్కరికీ సరిపోతుందని చెప్పలేం.
రియల్ ఎస్టేట్కు ప్రత్యేక ప్రాధాన్యం!
కియోసాకి పెట్టుబడి వ్యూహంలో రియల్ ఎస్టేట్కు చాలా ముఖ్యమైన స్థానం ఉంది. మంచి ప్రదేశంలో కొనుగోలు చేసిన ప్రాపర్టీ నుంచి అద్దె రూపంలో నిరంతర ఆదాయం రావడంతో పాటు.. భవిష్యత్తులో దాని విలువ పెరిగే అవకాశం కూడా ఉంటుంది.
ఈ రెండు కారణాల వల్ల రియల్ ఎస్టేట్ను ఆయన సంపదను నిర్మించే ముఖ్యమైన ఆస్తిగా చూస్తారు. అయితే ప్రాపర్టీ పెట్టుబడుల్లో కూడా లోన్ వడ్డీ, నిర్వహణ ఖర్చులు, పన్నులు, ఖాళీగా ఉండే కాలం, మార్కెట్ పరిస్థితులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
బంగారం, వెండి, బిట్కాయిన్పై ఆసక్తి
రియల్ ఎస్టేట్తో పాటు కియోసాకి బంగారం, వెండి, బిట్కాయిన్ వంటి వాటికి కూడా ప్రాధాన్యం ఇస్తారు. ముఖ్యంగా అమెరికా డాలర్ విలువ తగ్గే పరిస్థితుల్లో బిట్కాయిన్ను ప్రత్యామ్నాయ ఆస్తిగా ఆయన చూస్తారు. వెండిని కూడా దీర్ఘకాలిక పెట్టుబడిగా భావిస్తారు. బంగారంతో పోలిస్తే వెండి ధర తక్కువగా ఉండటంతో పాటు పారిశ్రామిక అవసరాలు కూడా ఉండటం వల్ల భవిష్యత్తులో దానికి డిమాండ్ కొనసాగుతుందని ఆయన అభిప్రాయం.
మొత్తం మీద రాబర్ట్ కియోసాకి చెప్పే అంశం ఏమిటంటే.. డబ్బును కేవలం దాచుకోవడం కాకుండా, అది మన కోసం పనిచేసేలా చేయడం. జీతం లేదా వ్యాపారం ద్వారా సంపాదించిన డబ్బును పూర్తిగా ఖర్చు చేయకుండా.. భవిష్యత్తులో ఆదాయం తెచ్చే ఆస్తులను కొనుగోలు చేయాలని ఆయన సూచిస్తున్నారు.
ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అప్పు తీసుకుని పెట్టుబడి పెడితే, లాభాలే కాదు.. నష్టాలను చవిచూడాల్సి ఉంటుంది. అధిక వడ్డీ రేట్లు, మార్కెట్ పతనం లేదా పెట్టుబడి నుంచి ఆదాయం రాకపోవడం వంటి పరిస్థితుల్లో అప్పు పెద్ద భారంగా మారే అవకాశం ఉంది. కియోసాకి ఆలోచనలోని అసలు పాఠం అప్పు చేయడం కాదు.. అప్పును తెలివిగా ఉపయోగించడం, ఆదాయం తెచ్చే ఆస్తులను నిర్మించుకోవడం, రిస్క్ను అర్థం చేసుకుని పెట్టుబడులు పెట్టడం. సంపదను నిర్మించుకోవడంలో డబ్బు ఎంత సంపాదిస్తున్నామన్నదే కాకుండా.. సంపాదించిన డబ్బుతో ఎలాంటి ఆస్తులను సృష్టిస్తున్నామన్నదే ముఖ్యం.


