
న్యూఢిల్లీ: భారత్ వాతావరణ (పర్యావరణ పరిరక్షణ) లక్ష్యాలను చేరుకోవడానికి విద్యుత్ వ్యవస్థలో మరింత పునరుత్పాదక శక్తిని అనుసంధానం చేయడం చాలా కీలకమని ఇన్స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ (ఐఈఈఎఫ్ఏ) తెలిపింది. దేశ విద్యుత్ వ్యవస్థలో క్లీన్ ఎనర్జీ వాటాను పెంచడానికి వివిధ చర్యలను కూడా సూచించింది.
2030 నాటికి ఉద్గారాల తీవ్రత తగ్గింపు లక్ష్యాన్ని చేరుకోవడానికి భారత్ పునరుత్పాదక ఇంధనంపై అత్యధిక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇందుకు అనుగుణంగా తన విద్యుత్ వ్యవస్థలో క్లీన్ ఎనర్జీ వాటాను పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఐఈఈఎఫ్ఏ ఎనర్జీ అనలిస్ట్, నివేదిక రచయిత చరిత్ కొండా తెలిపారు. 2030 నాటికి నాన్–ఫాసిల్ ఫ్యూయల్ పవర్ ఇన్స్టాల్ కెపాసిటీ వాటాను 50 శాతానికి పెంచడం ఎంతో ముఖ్యమని కొండా పేర్కొన్నారు.
2005 స్థాయిల నుండి 2030 నాటికి దాని ఆర్థిక వ్యవస్థ యొక్క ఉద్గారాల తీవ్రతను 45 శాతానికి తగ్గించడానికి విద్యుత్ వ్యవస్థలో వేరియబుల్ పునరుత్పాదక శక్తిని పెంచడం అవసరమన్నారు. స్థిరమైన టారిఫ్లకు బదులుగా ఎఫెక్టివ్ టైమ్–ఆఫ్–యూజ్ (టీఓయూ) విద్యుత్ టారిఫ్లను ప్రవేశపెట్టడం, విద్యుత్ రంగానికి మరింత పునరుత్పాదక ఇంధన అనుసంధానం వల్ల భారీ ప్రయోజనాలు ఒనగూరుతాయని, ముఖ్యంగా వినియోగ విధానాల్లో గణనీయమైన మార్పును చూడవచ్చని నివేదిక తెలిపింది. టీఓయూ ప్రైసింగ్ వల్ల పీక్ డిమాండ్ (కీలక సమాయాల్లో విద్యుత్ వినియోగం) 5 నుంచి 15 శాతం తగ్గుతుందని నివేదిక అభిప్రాయడింది.