కీలక వడ్డీరేట్లు యథాతథం | RBI Monitory Policy Meeting Outcome By Governor Das No Changes In Rates | Sakshi
Sakshi News home page

RBI Monitory Policy: కీలక వడ్డీరేట్లు యథాతథం

Apr 5 2024 12:06 PM | Updated on Apr 5 2024 12:09 PM

RBI Monitory Policy Meeting Outcome By Governor Das No Changes In Rates - Sakshi

భారతీయ రిజర్వ్‌బ్యాంక్‌ వరుసగా ఏడోసారి కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈమేరకు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ రెపోరేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించారు. బుధవారం ప్రారంభమైన ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి  విధాన (ఆర్‌బీఐ మానిటరీ పాలసీ) సమీక్ష సమావేశ నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం వెల్లడించారు. 

ఆర్‌బీఐ మానిటరీ పాలసీలోని ముఖ్యాంశాలు.. 

  • బెంచ్‌మార్క్‌ వడ్డీరేటు, రెపోరేటు స్థిరంగా 6.5శాతంగా ఉంది.
  • 2024-25 ఏడాదికిగాను జీడీపీ వృద్ధి 7 శాతం నమోదుకానుందని అంచనా.
  • ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.5 శాతం చేరే అవకాశం ఉంది. తొలి త్రైమాసికంలో 4.9%, రెండో త్రైమాసికంలో 3.8%, మూడో త్రైమాసికంలో 4.6%, నాలుగో త్రైమాసికంలో 4.5 శాతంగా ఉంటుందని అంచనా.
  • 2023-24కుగాను భారత్‌కు వచ్చిన విదేశీ సంస్థాగత పెట్టుబడులు 625 బిలియన్‌డాలర్లుగా ఉన్నాయి. ఇవి 2014-15 తర్వాత వచ్చిన రెండో అత్యధిక పెట్టుబడులుగా ఉన్నాయి. 
  • ఫిబ్రవరిలో ఆహార ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరిగింది. ద్రవ్యోల్బణ పెరుగుదలపై ఆర్‌బీఐ నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
  • గ్రామీణ గిరాకీ పుంజుకుంటోంది. ఇది 2024-25లో ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందని అంచనా.
  • ప్రపంచ వృద్ధి నేపథ్యంలో ముడి చమురు ధరల పెరుగుదలను నిశితంగా పరిశీలించాలి.
  • ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొంటున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కమొడిటీ ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. 
  • అంతర్జాతీయ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్‌లో సావరిన్ గ్రీన్ బాండ్‌పై ట్రేడింగ్ కోసం ఆర్‌బీఐ త్వరలో స్కీమ్‌ను నోటిఫై చేయనుంది.

కీలక రేట్లు ఇలా..

  • రెపోరేటు: 6.5 శాతం
  • ఎస్‌డీఎఫ్‌ రేటు: 6.25 శాతం
  • ఎంఎస్‌ఎఫ్‌ రేటు: 6.75 శాతం
  • బ్యాంక్‌ రేటు: 6.75 శాతం

Advertisement
 
Advertisement
Advertisement