
న్యూఢిల్లీ: సోలార్ ప్యానెళ్ల తయారీ సంస్థ రేజాన్ సోలార్ తాజాగా పబ్లిక్ ఇష్యూకి సిద్ధమవుతోంది. రూ. 1,500 కోట్ల సమీకరణకు సంబంధించి ఈ నెలాఖరు నాటికి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ)ని సమర్పించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐపీవో నిర్వహణ కోసం కంపెనీ ఇప్పటికే పలు దిగ్గజ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులను నియమించుకుంది.
తాజాగా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధులను కార్యకలాపాల విస్తరణకు కంపెనీ వినియోగించుకోనున్నట్లు సమాచారం. 2017లో ఏర్పాటైన రేజాన్ సోలార్ దేశీయంగా అత్యంత వేగంగా ఎదుగుతున్న సోలార్ పీవీ మాడ్యుల్స్ తయారీ సంస్థల్లో ఒకటిగా ఉంది. సంస్థవెబ్సైట్ ప్రకారం గుజరాత్లోని కారంజ్, సావా ప్లాంట్లలో 6,000 మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని సాధించింది. కంపెనీ ఇటీవల మార్చిలో ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా రూ. 138 కోట్లు సమీకరించింది.