రూ. 15.15 లక్షల కోట్ల స్కాం : దలాల్‌ స్ట్రీట్‌లో ప్రకంపనలు | Rajesh Exports Faked Rs 15 Lakh Crore Revenue Scandal Hits D Street | Sakshi
Sakshi News home page

రూ. 15.15 లక్షల కోట్ల స్కాం : దలాల్‌ స్ట్రీట్‌లో ప్రకంపనలు

Jun 4 2026 12:40 PM | Updated on Jun 4 2026 12:54 PM

Rajesh Exports Faked Rs 15 Lakh Crore Revenue Scandal Hits D Street

సాక్షి, ముంబై:  భారతదేశంలోని అతిపెద్ద లిస్టెడ్ సంస్థలలో ఒకటి, ప్రముఖ బంగారు శుద్ధి మరియు ఆభరణాల తయారీ సంస్థ రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ (Rajesh Exports)  భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. రూ. 15.15 లక్షల కోట్ల మేర భారీ ఆర్థిక అవకతవకలు జరిగినట్టు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ (SEBI)  ఆరోపించింది. ఈ  మేరకు జూన్ 3న జారీ చేసిన ఒక మధ్యంతర ఉత్తర్వులో సెబీ రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ , దాని ప్రమోటర్-చైర్మన్ రాజేష్ మెహతాలను సెక్యూరిటీల మార్కెట్‌లోకి ప్రవేశించకుండా నిషేధించింది. ఐదు ఆర్థిక సంవత్సరాల పాటు భారీ ఆర్థిక అవకతవకలు జరిగాయని రెగ్యులేటర్  వెల్లడించింది. ఈ ఆదేశాలు దలాల్ స్ట్రీట్‌లో ప్రకంపనలు సృష్టించాయి. దీని షేర్‌  బాగా పడిపోయింది. చివరికి కొనేవాళ్లు లేక లోయర్‌ సర్క్యూట్‌లోకి జారుకుంది.

బెంగళూరు కేంద్రంగా ఉన్న ఈ సంస్థ, ప్రపంచ బంగారు దిగ్గజంగా పేరు సంపాదించింది. ఆర్థిక సంవత్సరం FY21 నుంచి FY25 మధ్య కాలంలో, కంపెనీ తన విదేశీ అనుబంధ సంస్థల (ముఖ్యంగా స్విట్జర్లాండ్‌కు చెందినవాల్‌కంబి SA) ద్వారా రూ. 15.15 లక్షల కోట్ల మేర (కన్సాలిడేటెడ్ రెవెన్యూలో దాదాపు 99.8 శాతం)  తప్పుడు  ఆదాయాన్ని చూపించిందని సెబీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

దర్యాప్తు అధికారులు కోరిన అనేక కీలక పత్రాలను కంపెనీ అందించడంలో విఫలమైందని సెబీ తెలిపింది. ఫోరెన్సిక్ ఆడిటర్‌కు కస్టమర్ రికార్డులు, వెండర్ వివరాలు, ముఖ్యమైన అనుబంధ సంస్థల ఆర్థిక నివేదికలు సమర్పించలేదనీ, పొంతన లేని ఆదాయ వ్యవయాల వివరాలు, దర్యాప్తునకు సహకరించకపోవడం లాంటి వాటిని  రెగ్యులేటర్ ఎత్తి చూపింది. ఈ ఆదాయ ఆరోపణలతోపాటు ఆఫ్రికాలో ఉన్న బంగారు గనుల ఆస్తులలో రూ. 1,035 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు వచ్చిన నివేదికను కూడా సెబీ ప్రశ్నించింది.

ఎల్‌ఐసీకీ తప్పని ముప్పు
రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌లో సుమారు 10.8% వాటాను కలిగి ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అతిపెద్ద వాటాదారులలో ఒకటి. తాజా స్కాం కారణంగా వాటాదారుల సంపదలో రూ. 12,726 కోట్ల వరకు నష్టం వాటిల్లవచ్చని సెబీ అంచనా వేసింది. ఈ ప్రభావం ప్రమోటర్లు, నియంత్రణ సంస్థలకే పరిమితం కాలేదు.  పరోక్షంగా సంబంధం  ఉన్న లక్షలాది మంది సాధారణ పెట్టుబడిదారులను  కూడా ప్రభావితం  చేయనుంది.

ఇప్పటికే కెనరా బ్యాంక్ పోరాటం
మరోవైపు రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ఏకకాలంలో రుణదాతల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. బ్యాంకుకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ. 509 కోట్ల రుణాల చెల్లింపులో  విఫలం కావడంతో కెనరా బ్యాంక్ ఈ కంపెనీకి ఉన్న తన రుణాన్ని ఒత్తిడికి గురైన ఆస్తిగా (స్ట్రెస్డ్ అసెట్) వర్గీకరించింది.  ఫలితంగా, ఈ రుణదాత వేలం ప్రక్రియ ద్వారా ఒత్తిడికి గురైన ఈ రుణాన్ని విక్రయించేందుకు చర్యలు ప్రారంభించింది. బ్యాంకింగ్ సమస్య సెక్యూరిటీస్ మార్కెట్ విచారణకు భిన్నమైందే అయి నప్పటికీ, ఈ రెండూ కలిసి కంపెనీకి రెండు వైపుల సంక్షోభాన్ని సృష్టించాయి. 

సెబీ ఉత్తర్వు మధ్యంతరమైనదని గమనించడం ముఖ్యం. నియంత్రణ సంస్థ తన తుది తీర్పును ఇంకా వెలువరించలేదు.రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ , రాజేష్ మెహతాలకు తమ వాదన వినిపించుకునేందుకు, ఆరోపణలపై ప్రతిస్పందించేందుకు అవకాశం ఉంది. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నందున తుది ఫలితం రావడానికి సమయం పట్టవచ్చు.

ఒకవేళ ఇది రుజువైతే, భారతదేశ కార్పొరేట్ రంగంలో ఇప్పటివరకు చూసిన అతిపెద్ద స్కాంలలో ఒకటిగా నిలుస్తుంది. భారతదేశ కార్పొరేట్ పాలనా వ్యవస్థకు ఈ కేసు గుణపాఠంగా నిలవవచ్చు. పెట్టుబడిదారులకు ఇదొక తీవ్ర హెచ్చరిక. కంపెనీ ఎంత పెద్దదైనా, ఎంత గౌరవనీయమైనదైనా సరే, రిటైల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి మూలధనంలో గణనీయమైన భాగాన్ని ఒకే కంపెనీ స్టాక్‌లో కేంద్రీకరించే విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటూ, కంపెనీ  రెగ్యులేటరీ ఫైలింగ్‌లు, స్టాక్ ఎక్స్ఛేంజ్ డిస్క్లోజర్‌లు, రెడ్ ఫ్లాగ్‌లను పర్యవేక్షించాలి అంటున్నారు నిపుణులు.

ఇదీ చదవండి: ఆస్తికోసం వ్యాపారవేత్త కుటుంబం దారుణ హత్య, ఆ తర్వాత షాకింగ్‌ ఘటన

Advertisement
 
Advertisement
Advertisement