పర్యావరణ పరిరక్షణ, పెరుగుతున్న వాహన కాలుష్య నివారణే లక్ష్యంగా ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో చెల్లుబాటు అయ్యే ‘పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్’(పీయూసీ) లేని ఏ వాహనానికీ పెట్రోల్ లేదా డీజిల్ విక్రయించకూడదని రాష్ట్ర రవాణా యంత్రాంగం (ఎస్టీఏ) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
చమురు సంస్థలకు కీలక ఆదేశాలు
ఈ నిబంధనను తక్షణమే అమలు చేయాలని కోరుతూ ఇండియన్ ఆయిల్ (IOCL), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రిలయన్స్, షెల్ వంటి ప్రైవేట్ చమురు సంస్థలకు కూడా రవాణా శాఖ లేఖలు రాసింది. ప్రతి ఫ్యుయల్ స్టేషన్ వద్ద వాహనదారుడి పీయూసీ సర్టిఫికేట్ను సిబ్బంది భౌతికంగా లేదా డిజిటల్ రూపంలో తనిఖీ చేసిన తర్వాతే ఇంధనం పోయాల్సి ఉంటుంది.
అవగాహన కార్యక్రమాలు
ఈ కొత్త నిబంధనపై వాహనదారులకు, పెట్రోల్ బంక్ సిబ్బందికి తగినంత అవగాహన కల్పించాలని చమురు సంస్థలను కోరింది. ఒకవేళ సర్టిఫికేట్ లేని వాహనాలకు ఇంధనం సరఫరా చేస్తే సంబంధిత డీలర్లపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఎస్టీఏ హెచ్చరించింది.
చట్టపరమైన నిబంధనలు ఇవే..
మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 190(2), సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్, 1989లోని రూల్ 115 ప్రకారం.. ప్రతి వాహనం నిర్దేశిత ఉద్గార ప్రమాణాలకు లోబడి ఉండాలి. పీయూసీ లేకుండా వాహనం నడపడం చట్టరీత్యా నేరమని, దీనివల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోందని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఢిల్లీ బాటలోనే ఒడిశా
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తీవ్రమైన స్థాయికి చేరడంతో అక్కడ ఇప్పటికే ‘నో పీయూసీ - నో ఫ్యూయల్’ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఢిల్లీలో ప్రస్తుతం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ-4) అమల్లో ఉంది. అదే బాటలో ఒడిశా ప్రభుత్వం కూడా ముందుస్తు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టింది.
ఇదీ చదవండి: పన్ను చెల్లింపుదారుల సోషల్ మీడియా, ఈమెయిల్స్పై నిఘా


