
దేశంలో యువత "వారానికి 70 గంటలు" పని చేయాలని ఇన్ఫోసిస్ (Infosys) వ్యవస్థాపకుడు నారాయణమూర్తి (Narayana Murthy)ఇచ్చిన సలహాపై దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన కొనసాగుతోంది. సోషల్ మీడియాలో అయితే విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్పర్సన్, రచయిత్రి సుధా మూర్తి (Sudha Murty) స్పందించారు. తన భర్త నారాయణ మూర్తి వ్యాఖ్యలను సమర్థించారు.
నిజమైన కష్టాన్నే నమ్ముతారు
నారాయణమూర్తి స్వయంగా వారానికి 80-90 గంటలు పనిచేశారని, నిజమైన హార్డ్ వర్క్పై ఆయనకు నమ్మకం ఉందని సుధామూర్తి చెప్పారు. ‘ఆయన వారానికి 80 నుండి 90 గంటలు పని చేశారు. ఆయనకు అదే తెలుసు. నిజమైన కష్టాన్ని నమ్మే ఆయన అలాగే జీవించారు. అందుకే ఆయనకు అనిపించింది చెప్పారు’ అని సుధామూర్తి న్యూస్ 18కి చెప్పారు.
ఈ రోజుల్లో కార్పొరేట్ ఇండియాలో పరిస్థితులు ఎలా ఉన్నాయో నారాయణమూర్తికి చెప్పడానికి ప్రయత్నించారా అని అడిగినప్పుడు.. యువత భిన్న భావాలను కలిగి ఉంటారని, అయితే స్వయంగా ఎక్కువ గంటలు పనిచేసిన నారాయణ మూర్తి తన అనుభవాన్ని పంచుకున్నారని ఆమె వివరించారు.
(టీసీఎస్లో మరో కొత్త సమస్య! ఆఫీస్కి రావాల్సిందే అన్నారు.. తీరా వెళ్తే..)
భారతీయ యువత ఉత్పాదకతపై నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. యువత రోజుకు 12 గంటలు పని చేస్తేనే గత 2-3 దశాబ్దాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన దేశాలను భారత్ చేరుకోగలదని నారాయణమూర్తి ఇటీవల పాడ్కాస్ట్లో చెప్పారు. భారతదేశ ఉత్పాదకత ప్రపంచంలోనే అత్యల్పంగా ఉందని ఆయన అన్నారు.