టాప్‌లో ఇన్ఫోసిస్ బాస్.. విప్రో సీఈఓ వేతనం ఎంతంటే? | Infosys CEO Salil Parekh Tops IT CEO Pay Chart with Rs 82 6 Crore in FY26 | Sakshi
Sakshi News home page

టాప్‌లో ఇన్ఫోసిస్ బాస్.. విప్రో సీఈఓ వేతనం ఎంతంటే?

Jun 4 2026 6:28 PM | Updated on Jun 4 2026 6:41 PM

Infosys CEO Salil Parekh Tops IT CEO Pay Chart with Rs 82 6 Crore in FY26

భారతదేశంలోని ప్రముఖ ఐటీ సేవల సంస్థల సీఈఓల వేతనాల విషయంలో FY26 ఆర్థిక సంవత్సరంలో కూడా ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సలీల్ పరేఖ్ అగ్రస్థానంలో నిలిచారు. ఆయనకు మొత్తం రూ. 82.6 కోట్ల పారితోషికం లభించింది. దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీల సీఈఓలలో ఇది అత్యధిక వేతనం కావడం విశేషం.

కాగా విప్రో సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'శ్రీనివాస్ పల్లియా' పారితోషికం తగ్గినప్పటికీ రెండవ స్థానంలో నిలిచారు. బుధవారం విడుదల చేసిన విప్రో వార్షిక నివేదిక ప్రకారం, FY26లో పల్లియా పరిహారం రూ. 49.6 కోట్లుగా ఉంది. ఇది గత ఏడాది రూ. 53.6 కోట్ల కన్నా 7.4% తక్కువ.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సీఈఓ కే. కృతివాసన్ ఈ సంవత్సరంలో రూ. 28 కోట్లు అందుకున్నారు. ఇప్పటివరకు తమ పరిహార వివరాలను వెల్లడించిన దేశంలోని ప్రముఖ ఐటీ సేవల సంస్థల అధిపతులలో ఆయన అత్యల్ప వేతనం పొందిన వ్యక్తిగా నిలిచారు. అయితే హెచ్సీఎల్ టెక్నాలజీస్ తన FY26 యాన్యువల్ రిపోర్టును ఇంకా విడుదల చేయలేదు.

ఇన్ఫోసిస్ సీఈఓ సలిల్ పరేఖ్ వేతనంలో ప్రధాన భాగం షేర్ల ఆధారిత ప్రోత్సాహకాల నుంచే వచ్చింది. ఆయనకు రూ. 50.75 కోట్ల విలువైన రెస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్స్ (RSUs), రూ. 23.35 కోట్ల స్టాక్ బేస్డ్ ఇన్సెంటివ్స్ లభించాయి.

విప్రో వార్షిక నివేదిక ప్రకారం.. FY26లో శ్రీనివాస్ పల్లియా జీతం, ఇతర అలవెన్సులు రూ. 14.6 కోట్ల నుంచి రూ. 15.5 కోట్లకు పెరిగినప్పటికీ, వేరియబుల్ పే రూ. 14.5 కోట్ల నుంచి రూ. 9.9 కోట్లకు తగ్గడంతో మొత్తం వేతనం కొంత తగ్గింది. అదనంగా.. ఇతర విభాగాల కింద రూ. 23.3 కోట్లు, డిఫర్డ్ కాంపెన్సేషన్ బెనిఫిట్స్ రూపంలో సుమారు రూ. కోటి పొందారు.

విప్రో సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషాద్ ప్రేమ్‌జీ వేతనం కూడా గణనీయంగా తగ్గింది. FY25లో రూ. 13.8 కోట్లుగా ఉన్న ఆయన పారితోషికం FY26లో రూ. 7.3 కోట్లకు పడిపోయింది. అలాగే వేరియబుల్ పే రూ. 7 కోట్ల నుంచి రూ. 2.2 కోట్లకు తగ్గింది.

విప్రో వార్షిక నివేదిక ప్రకారం.. శ్రీనివాస్ పల్లియా, రిషాద్ ప్రేమ్‌జీ ఇద్దరికీ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే పెరిగిన సమీకృత నికర లాభంపై 0.35 శాతం కమిషన్ పొందే హక్కు ఉంది. ఇది సంస్థ పనితీరు మెరుగుపడితే వారికి అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఏది?: కియోసాకి సమాధానం ఇదే..

Advertisement
 
Advertisement
Advertisement