సూక్ష్మ వ్యాపారాల్లో పెరుగుతున్న చెల్లింపుల ఒత్తిడి
తయారీ, వాణిజ్య రంగాల్లో బలహీనపడిన రుణ వృద్ధి
పీఎస్యూ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల రుణాల జోరు తగ్గుదల
ముంబై: అంతర్జాతీయ అనిశ్చితుల ప్రభావంతో దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగంలో రుణాల వృద్ధి మందగించింది. ముఖ్యంగా సూక్ష్మ వ్యాపారాలు, తయారీ రంగ అనుబంధ విభాగాల్లో ఒత్తిడి సంకేతాలు కనిపిస్తున్నట్లు క్రెడిట్ సమాచార సంస్థ క్రిఫ్ హైమార్క్ తాజా నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఎంఎస్ఎంఈల రుణ బకాయిలు సుమారు రూ.46 లక్షల కోట్లకు చేరాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 12.8 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది.
బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగుపడటం, వివిధ రంగాల భాగస్వామ్యం పెరగడం, ప్రభుత్వ ప్రోత్సాహక చర్యలు ఈ వృద్ధికి దోహదపడ్డాయి. అయితే రుణాల వృద్ధి వేగం గణనీయంగా మందగించింది. 2025 డిసెంబర్–2026 ఏప్రిల్ మధ్య రుణ బకాయిల వృద్ధి 3.1 శాతానికి పరిమితమైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి 9.7 శాతంగా నమోదైంది. ఇదే వ్యవధి (2025 డిసెంబర్–2026 ఏప్రిల్)లో క్రియాశీల రుణాల సంఖ్య 3.5 శాతం తగ్గింది. కాగా, 2024 డిసెంబర్–2025 ఏప్రిల్ మధ్య కాలంలో అవి 3 శాతం పెరిగాయి.
సూక్ష్మ వ్యాపారాలపై అధిక ప్రభావం
భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ దేశీయ డిమాండ్, రుణాల ప్రవాహం మద్దతుతో ఎంఎస్ఎంఈ రంగం నిలకడగా కొనసాగుతోందని నివేదిక పేర్కొంది. అయితే కొన్ని నిర్దిష్ట విభాగాల్లో ఒత్తిడి సంకేతాలు కనిపిస్తున్నాయి. మొత్తం ఎంఎస్ఎంఈ రుణాల్లో దాదాపు 86 శాతం వాటా కలిగిన సూక్ష్మ వ్యాపారాలు ఎక్కువ ప్రభావానికి గురయ్యాయి. 31–90 రోజుల ఆలస్య చెల్లింపుల సూచిక (పీఏఆర్) ఏప్రిల్ 2026 నాటికి 2.7 శాతానికి చేరింది. 2025 డిసెంబర్–2026 మార్చి మధ్య సూక్ష్మ వ్యాపారాలకు చెందిన క్రియాశీల రుణాలు 4.6 శాతం క్షీణించాయి.
తయారీ రంగంలో తగ్గిన జోరు
ఎంఎస్ఎంఈ పోర్ట్ఫోలియోలో దాదాపు 60 శాతం వాటా ఉన్న తయారీ, వాణిజ్య రంగాల్లో రుణ వృద్ధి మందగించింది. తయారీ రంగ రుణ వృద్ధి 2025 డిసెంబర్–2026 మార్చి మధ్య 4.3 శాతానికి పరిమితమైంది. దీనికి సీజనల్ మార్పులే ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది. సప్లై చైన్తో ముడిపడి ఉన్న షిప్పింగ్, రవాణా, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటో అనుబంధ రంగాల్లో రుణ బకాయిలు 10–15 శాతం మేర తగ్గాయి.
బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల వెనకడుగు
ఎంఎస్ఎంఈలకు రుణాల పంపిణీలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల వేగం కూడా తగ్గింది. 2025 డిసెంబర్–2026 మార్చి మధ్య ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎంఎస్ఎంఈ రుణాలు 0.2 శాతం తగ్గాయి. కాగా, అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 3.5 శాతం వృద్ధి నమోదైంది. ఎన్బీఎఫ్సీల రుణాలు 1.6 శాతం క్షీణించగా, గత ఏడాది ఇదే కాలంలో 6.4 శాతం పెరిగాయి. దేశీయ డిమాండ్, విభిన్న రుణదాతల భాగస్వామ్యం, ప్రభుత్వ మద్దతు చర్యలతో ఎంఎస్ఎంఈ రంగం ప్రపంచ అనిశ్చితులను సమర్థంగా ఎదుర్కొంటోందని నివేదిక పేర్కొంది. అయితే ఇప్పుడిప్పుడే పుట్టుకొస్తున్న ఒత్తిడి సంకేతాలపై నిశిత పర్యవేక్షణ అవసరమని నివేదిక సూచించింది.


