మోదీ పాలనలో డిజిటల్‌ విప్లవం  | Modi government has driven a historic transformation of India digital sector | Sakshi
Sakshi News home page

మోదీ పాలనలో డిజిటల్‌ విప్లవం 

Jun 11 2026 6:12 AM | Updated on Jun 11 2026 6:12 AM

Modi government has driven a historic transformation of India digital sector

పన్నెండేళ్లలో 97 శాతం తగ్గిన డేటా ధరలు! 

రూ.269 నుంచి రూ.8–10కి పడిపోయిన జీబీ ధర 

103 కోట్లకు చేరిన ఇంటర్నెట్‌ వినియోగదారులు 

మొబైల్‌ ఎగుమతుల్లో సరికొత్త రికార్డు 

న్యూఢిల్లీ: గడిచిన పన్నెండేళ్లలో మోదీ ప్రభుత్వ కాలంలో దేశంలో డిజిటల్‌ రంగం ఊహించని వేగంతో దూసుకుపోయిందని అధికారిక నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఇంటర్నెట్‌ డేటా ధరలు భారీగా తగ్గడం, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ వాడకం పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిచ్చాయని బుధవారం విడుదల చేసిన ‘మోదీ ప్రభుత్వ 12 ఏళ్ల పాలన’ నివేదిక పేర్కొంది. 

నివేదికలో ప్రధాన అంశాలు: 
→ డేటా ధరల భారీగా దిగివచ్చాయి. 2014లో ఒక జీబీ డేటా ధర రూ. 269 గా ఉండగా, ప్రస్తుతం అది ఏకంగా 97 శాతం తగ్గి రూ. 8 నుంచి రూ.10 కి పడిపోయింది. 

→ ఇంటర్నెట్‌ వినియోగదారులు భారీ పెరిగారు. 2014లో దేశంలో వినియోగదారుల సంఖ్య కేవలం 25 కోట్లుగా ఉంటే, 2025 డిసెంబర్‌ నాటికి అది నాలుగు రెట్లు పెరిగి 103 కోట్లకు చేరింది. 

→ బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లు సైతం 12 ఏళ్లలో 17 రెట్లు పెరిగి, ఆరు కోట్ల నుంచి 100 కోట్లకు దూసుకెళ్లాయి. నగరాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఇంటర్నెట్‌ వాడకం వేగంగా విస్తరించింది. 

→ ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావడం వల్ల ఈ–కామర్స్, ఆన్‌లైన్‌ సేవలు పుంజుకున్నాయని, ఇది ఉపాధి కల్పనకు, దేశ జీడీపీ వృద్ధికి కారణమైందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. 

→ 2022–23 ఆర్థిక సంవత్సరంలో భారత డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ విలువ రూ. 31.64 లక్షల కోట్లుగా నమోదైంది. ఇది దేశ జాతీయ ఆదాయంలో 11.74 శాతానికి సమానం. 

→ సాధారణ ఆర్థిక వ్యవస్థ కంటే డిజిటల్‌ రంగం రెట్టింపు వేగంతో వృద్ధి చెందుతోందని, 2030 నాటికి జాతీయ ఆదాయంలో ఇది అయిదో వంతు (దాదాపు 20%) వాటాను ఆక్రమిస్తుందని నివేదిక అంచనా వేసింది. 

→ ఒకప్పుడు మొబైల్‌ ఫోన్లను దిగుమతి చేసుకునే భారత్, ఇప్పుడు ప్రపంచంలోనే అగ్రగామి ఎగుమతిదారుగా అవతరించింది. మొబైల్‌ ఎగుమతుల విలువ రూ. 0.016 లక్షల కోట్ల నుంచి ఏకంగా రూ. 2.6 లక్షల  కోట్లకు పెరిగింది. 2014లో దేశంలో కేవలం రెండు మొబైల్‌ తయారీ యూనిట్లు మాత్రమే ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 300 దాటింది. 

→ 2014లో దేశంలో ఒక్క సెమీకండక్టర్‌ (చిప్‌) ప్లాంట్‌ కూడా లేదు. కానీ ప్రస్తుతం మోదీ ప్రభుత్వం 12 ప్లాంట్లకు అనుమతులు మంజూరు చేసింది. స్వదేశీ సాంకేతికతతో 5జీ టెలికాం పరికరాల తయారీలో భారత్‌ ముందడుగు వేసింది. 

→ గడిచిన దశాబ్ద కాలంలో ప్రభుత్వ ఆధార్‌ గుర్తింపు కార్డుల జారీ సైతం ఊపందుకుంది. 2014లో 61.01 కోట్లుగా ఉన్న కార్డుల సంఖ్య ఇప్పుడు 144 కోట్ల మార్కును దాటిందని నివేదిక స్పష్టం చేసింది. డిజిటల్‌ విప్లవం ద్వారా దేశంలో సమాచారం, వనరులు, సరికొత్త అవకాశాలు ప్రజలకు ఉచితంగా లభిస్తున్నాయని కేంద్రం పేర్కొంది.  

సమ్మిళిత ఆర్థికాభివృద్ధి
 కార్పొరేట్ల స్పందన
న్యూఢిల్లీ: ప్రధానిగా సరికొత్త రికార్డు నెలకొల్పిన నరేంద్ర మోడీ చేపట్టిన సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ సమ్మిళిత వృద్ధిని సాధించినట్లు కార్పొరేట్‌ వర్గాలు పేర్కొన్నాయి. పరివర్తనకు బాటలు వేయడం ద్వారా ప్రపంచస్థాయిలో ప్రభావం చూపగల దేశంగా భారత్‌ అవతరించినట్లు తెలియజేశాయి. సరళతర వ్యాపార నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం బలపడినట్లు పరిశ్రమల సమాఖ్యలు పేర్కొన్నాయి. 2047 వికసిత్‌ భారత్‌ ప్రణాళికతో దేశీ కార్పొరేట్‌ రంగానికి ప్రోత్సాహం లభించినట్లు తెలియజేశాయి. 

సామర్థ్యాల పెంపు.. 
దేశ సామర్థ్యాలపట్ల పెరుగుతున్న నమ్మకాన్ని నిలకడ, లక్ష్యం, నిరంతర పురోభివృద్ధి ప్రతిబింబిస్తున్నట్లు సీఐఐ ప్రెసిడెంట్‌ ఆర్‌.ముకుందన్‌ పేర్కొన్నారు. దీంతో గ్లోబల్‌ ఎకనమిక్‌ పవర్‌హౌస్‌గా భారత్‌ ఎదుగుతున్నట్లు తెలియజేశారు. దేశం 2047 వికసిత్‌ భారత్‌వైపు ప్రయాణిస్తున్న నేపథ్యంలో పరిశ్రమల రంగం ప్రభుత్వంతో కలసి నడుస్తున్నట్లు తెలియజేశారు. పెట్టుబడుల పెంపు, బలపడుతున్న పోటీతత్వం, నైపుణ్య ఉద్యోగులతో పరిశ్రమలు ఇందుకు మద్దతిస్తున్నట్లు వివరించారు.  

రికార్డ్‌ పెట్టుబడులు.. 
దేశ ప్రజాస్వామ్య ప్రయాణంలో మైలురాయిని అందుకున్న ప్రధాని మోడీకి శుభాకాంక్షలు చెబుతూ.. దేశ ఆర్థిక మూలాలు గత 12ఏళ్లలో స్థిరంగా ఏకీకృతమైనట్లు ఫిక్కీ ప్రెసిడెంట్‌ అనంత్‌ గోయెంకా పేర్కొన్నారు. పటిష్ట సంస్కరణలు, బిజినెస్‌ల నిర్వహణ సులభతరం చేయడం, మౌలిక సదుపాయాలపై రికార్డ్‌ పెట్టుబడులు, వాణిజ్య భాగస్వామ్యాల విస్తరణ, సమ్మిళిత ఆర్థికాభివృద్ధి, ప్రపంచస్థాయి తయారీ వ్యవస్థ దేశ ఆర్థిక నడకను మార్చివేసినట్లు వివరించారు. 

కాంతులీనుతోంది.. 
ప్రధాని మోడీ అధ్యక్షతన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ కాంతులీనుతున్నట్లు అసోచామ్‌ ప్రెసిడెంట్‌ నిర్మల్‌ కె.మిండా పేర్కొన్నారు. ఇతర ఏ ప్రపంచ ప్రధాన వ్యవస్థలలో చూసినా దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ట పురోభివృద్ధిని సాధిస్తున్నట్లు తెలియజేశారు. 2013–14లో నమోదైన 1.9 ట్రిలియన్‌ డాలర్లతో పోలిస్తే జీడీపీ రెట్టింపునకుపైగా ఎగసి గతేడాది(2025–26)కల్లా 4.1 ట్రిలియన్‌ డాలర్లను తాకినట్లు వెల్లడించారు. ఇందుకు తయారీ, సర్వీసుల రంగాలు సహకరించినట్లు పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement