
న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ఉత్పత్తుల సంస్థ ‘మివి’ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) రూ.1,000 ఆదాయాన్ని సాధించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. మరిన్ని విభాగాల్లో ఉత్పత్తులను ఆవిష్కరించడంతోపాటు మరిన్ని ప్రాంతాలకు కార్యకలాపాలను విస్తరించడం, కొత్త తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, మార్కెటింగ్ వ్యూహాల అమలు ద్వారా దీన్ని సాధించనున్నట్టు మివి సహ వ్యవస్థాపకులు మిధుల దేవభక్తుని, విశ్వనాథ్ కందుల ప్రకటించారు.
ఈ సంస్థ 2024–25లో రూ.300 కోట్ల ఆదాయాన్ని నమోదు చేయడం గమనార్హం. 1,500 మందికి ఉపాధి కల్పిస్తోంది. కంపెనీ విస్తరణ ప్రణాళికల గురించి ఓ వార్తా సంస్థతో సహ వ్యవస్థాకులు వివరాలు పంచుకున్నారు. ఐవోటీ డివైజ్లు, స్మార్ట్ వేరబుల్స్, స్మార్ట్ సీసీటీవీ కెమెరాలు, స్పీకర్లలోని ప్రవేశించనున్నట్టు చెప్పారు. అలాగే, ప్రస్తుత ఆడియో, మొబైల్ యాక్సెసరీల కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్టు తెలిపారు. ఇయర్ బడ్స్ను విడుదల చేయడం ద్వారా తొలుత ఇయర్ఫోన్లలోకి ప్రవేశించనున్నట్టు మిధుల ప్రకటించారు.
ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్ ‘మివి ఏఐ’ని కంపెనీ ఇటీవలే ఆవిష్కరించడం గమనార్హం. తన ఉత్పత్తులకు ఏఐ టెక్నాలజీని జోడించడం ద్వారా కస్టమర్లకు మెరుగైన అనుభవం ఇచ్చే లక్ష్యంతో ఉంది. ఈ ఏఐ ప్లాట్ఫామ్ సాయంతో తమ ఆదాయాలను రెట్టింపు చేసుకోనున్నట్టు కంపెనీ వ్యవస్థాపకులు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ప్రజల నుంచి నిధులు (ఐపీవో) సమీకరించనున్నట్టు చెప్పారు.
హైదరాబాద్ కేంద్రంలో కార్యకలాపాలు...
హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్న తయారీ కేంద్రం జూన్ నాటికి కార్యకలాపాలు మొదలు పెడుతుందని మివి ప్రమోటర్లు ప్రకటించారు. 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే ఈ సదుపాయం ద్వారా విడిభాగాల తయారీపై దృష్టి సారిస్తామని, అంతర్జాతీయ బ్రాండ్లతో భాగస్వామ్యాలను కుదుర్చుకోనున్నట్టు తెలిపారు. యూఎస్, మధ్యప్రాచ్యం, యూరప్ మార్కెట్లలోకి విస్తరించనున్నట్టు చెప్పారు.