పెరగనున్న మారుతీ కార్ల ధరలు..కారణం ఏంటంటే! 

Maruti Suzuki to hike prices from April 2022 - Sakshi

న్యూఢిల్లీ: ముడి వస్తువుల ధరలు ఎగుస్తున్న నేపథ్యంలో తమ వాహనాల రేట్లను ఈ నెలలో పెంచనున్నట్లు దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ (ఎంఎస్‌ఐ) వెల్లడించింది. మోడల్‌ను బట్టి ధరల పెంపు ఉంటుందని పేర్కొంది. అయితే, ఎంత మేర పెంచేదీ మాత్రం వెల్లడించలేదు.

ముడి వస్తువుల రేట్ల పెరుగుదలతో గత ఏడాది కాలంగా వాహనాల తయారీ వ్యయంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని ఎంఎస్‌ఐ వివరించింది. దీనితో కొంత భారాన్ని రేట్ల పెంపు రూపంలో కొనుగోలుదారులకు బదలాయించక తప్పడం లేదని పేర్కొంది. ఉక్కు, అల్యుమినియం వంటి కమోడిటీలతో పాటు సరకు రవాణా చార్జీలు మొదలైనవన్నీ పెరిగిపోవడంతో పలు ఆటోమొబైల్‌ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను ఏప్రిల్‌ నుండి పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి.

మారుతీ సుజుకీ గతేడాది జనవరి నుండి ఈ ఏడాది మార్చి మధ్యకాలంలో 8.8 శాతం మేర తమ ఉత్పత్తుల ధరలను పెంచింది. ఆల్టో మొదలుకుని ఎస్‌–క్రాస్‌ వరకూ వివిధ మోడల్స్‌ను మారుతీ సుజుకీ విక్రయిస్తోంది. వీటి ధర రూ. 3.25 లక్షల నుండి రూ. 12.77 లక్షల వరకూ (ఢిల్లీ ఎక్స్‌షోరూం) ఉంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top