రైల్వే టికెట్ బుకింగ్లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్ పెట్టేందుకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే జూలై 15 నాటికి పూర్తిగా పునరుద్ధరించిన, ఆధునిక ఫీచర్లతో కూడిన కొత్త ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. విద్యార్థులతో జరిగిన ఓ సమావేశంలో ప్రస్తుత పోర్టల్లో ఉన్న లోపాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు.
సమావేశంలో ఓ విద్యార్థిని క్యాప్చా సమస్యలు, తత్కాల్ బుకింగ్ సమయంలో వెబ్సైట్ నెమ్మదించడం లేదా క్రాష్ కావడం, పాతబడిన డిజైన్, తరచూ ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందుల గురించి ప్రస్తావించింది. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి, 30 రోజుల్లో కొత్త వెబ్సైట్ సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం జూలై 15న కొత్త పోర్టల్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు.
రైల్వే వర్గాల సమాచారం ప్రకారం, కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్ మరింత వేగవంతంగా, వినియోగదారులకు అనుకూలంగా ఉండేలా రూపొందిస్తున్నారు. టికెట్ బుకింగ్ ప్రక్రియను సరళీకృతం చేయడం, అధిక ట్రాఫిక్ను సమర్థంగా నిర్వహించడం, చెల్లింపుల ప్రక్రియను మెరుగుపరచడం, మొబైల్, డెస్క్టాప్ వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించడం లక్ష్యంగా అభివృద్ధి చేస్తున్నారు.


