
భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదరనుందనే అంచనాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం అవుతున్నాయి. ఈమేరకు భారత కంపెనీల ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. ఇరు దేశాల మధ్య టారిఫ్ సర్దుబాట్లు ఉంటాయని వాణిజ్య వర్గాలు అంటున్నాయి. ఈ మార్పులు భారతీయ వ్యాపారాలకు ముఖ్యంగా తయారీ, వినియోగ ఉత్పత్తుల్లో కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని చెబుతున్నారు.
డిక్సన్ టెక్నాలజీస్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ వంటి కంపెనీలు ఈ మార్పులో కీలక లబ్ధిదారులుగా నిలువనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు డిక్సన్ టెక్నాలజీస్కు పెరుగుతున్న ఎగుమతి ఆర్డర్లకు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని 50% పెంచుతోంది. ఇది భారతీయ సరఫరా గొలుసులపై యూఎస్ సంస్థలు ఆధారపడటాన్ని హైలైట్ చేస్తోంది. టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అమెరికాలో తన మార్కెట్ను పెంచుకుంటోంది. కాఫీ, టీ వంటి విభాగాల్లో ఈ కంపెనీకి యూఎస్లో భారీ మార్కెట్ ఉంది. ఇలాంటి అమెరికాకు ఎగుమతులు చేసే చాలా కంపెనీలకు ఈ ఒప్పందం వల్ల లాభం చేకూరనుంది.
ఇదీ చదవండి: స్టాక్మార్కెట్, కరెన్సీ అప్డేట్స్
దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ ఆశాజనకంగా ఉన్నప్పటికీ పెరుగుతున్న ఖర్చులు, వాణిజ్య నిబంధనల్లో ఒడిదొడుకుల కారణంగా కొన్ని భారతీయ సంస్థలు స్వల్పకాలిక మార్జిన్ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. ఏదేమైనా దీర్ఘకాలంలో మాత్రం దేశీయ ఉత్పత్తులకు విదేశాల్లో గిరాకీ నెలకొంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రతిపాదిత భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మెరుగైన మార్కెట్ అవకాశాలను అందిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ఒప్పందం కుదిరితే సుంకాలు తగ్గుతాయని అంటున్నారు. ప్రపంచ వాణిజ్యంలో భారత ఉత్పత్తులకు పోటీని మరింత పెంచుతుందని భావిస్తున్నారు. ఈ ఒప్పందం విజయవంతం అయితే సీమాంతర పెట్టుబడులు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.