ఫోర్స్డ్‌ లేబర్‌ విధానంపై యూఎస్‌ ద్వంద్వ నీతి | India vs US forced labor tariff double standards | Sakshi
Sakshi News home page

ఫోర్స్డ్‌ లేబర్‌ విధానంపై యూఎస్‌ ద్వంద్వ నీతి

Jul 9 2026 1:55 PM | Updated on Jul 9 2026 2:33 PM

India vs US forced labor tariff double standards

ప్రపంచ సరఫరా గొలుసు (గ్లోబల్ సప్లై చైన్) నుంచి బలవంతపు శ్రమను (ఫోర్స్డ్ లేబర్) నిర్మూలించాలనే నెపంతో అమెరికా ప్రతిపాదిస్తున్న నూతన సుంకాల విధానంలోని లోపాలను, ద్వంద్వ ప్రమాణాలను భారతదేశం అంతర్జాతీయ వేదికపై బట్టబయలు చేసింది. తమ దేశీయ అవసరాల కోసం ఏకంగా 1,600 వస్తువులకు మినహాయింపులు ఇచ్చుకుంటూ ఇతర దేశాలపై ఏకపక్షంగా సుంకాలు విధించాలనుకోవడం అమెరికా అస్థిర వైఖరికి అద్దం పడుతోందని భారత్ ఘాటుగా విమర్శించింది. యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్‌టీఆర్‌) ప్రతిపాదించిన సుంకాలపై జరిగిన బహిరంగ విచారణలో భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ బ్రిజ్ మోహన్ మిశ్రా యూఎస్‌టీఆర్‌ ప్యానెల్ ముందు కీలక సాక్ష్యాలుంచారు.

అమెరికా విధానం హేతుబద్ధం కాదు

అమెరికా తన దేశంలో ఉత్పత్తి చేయలేని 1,600 వస్తువులను బలవంతపు కార్మికుల(ఫోర్స్డ్‌ లేబర్‌) పరిశీలన పరిధి నుంచి ఏకపక్షంగా మినహాయించుకుందని జాయింట్ సెక్రటరీ బ్రిజ్ మోహన్ మిశ్రా ఎత్తి చూపారు. ‘యూఎస్‌టీఆర్‌ ప్రకటించిన ఈ మినహాయింపులు అంతర్జాతీయ సరఫరా గొలుసులో బలవంతపు శ్రమ ప్రభావాన్ని పరిష్కరించాలనే అమెరికా విధాన హేతుబద్ధతను పూర్తిగా బలహీనపరుస్తున్నాయి. అంతేకాకుండా, లూప్‌హోల్స్ (సర్కమ్వెన్షన్ పద్ధతులు) ద్వారా జరిగే దుష్ప్రభావాన్ని నివారించడంలో ఈ విధానం విఫలమైంది’ అని బ్రిజ్ మోహన్ మిశ్రా తెలిపారు.

టెక్స్‌టైల్ రంగంలో అమెరికా అనుసరిస్తున్న తీరును కూడా ఆయన తప్పుపట్టారు. అమెరికాకు చెందిన పత్తి, ఇతర వస్త్ర ముడిసరుకులను ఉపయోగించి తయారుచేసే వస్త్ర ఉత్పత్తుల ఎగుమతులపై యూఎస్ సుంకం రేట్లను తగ్గించడాన్ని ఆయన హైలైట్‌ చేశారు. ఇది విదేశీ తయారీదారులు తమ నిర్ణయాలను మార్చుకునేలా బలవంతం చేసే ఏకపక్ష చర్యే తప్ప బలవంతపు శ్రమ సమస్యకు నిజమైన పరిష్కారం కాదని స్పష్టం చేశారు.

ఏవైనా ఆందోళనలు ఉంటే వాటిని 'సెక్షన్ 301' దర్యాప్తు వంటి ఏకపక్ష పద్ధతుల్లో కాకుండా, భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య చర్చల చట్రంలోనే పరిష్కరించుకోవడానికి భారతదేశం సిద్ధంగా ఉందని మిశ్రా పునరుద్ఘాటించారు.

అమెరికన్ వినియోగదారులకే నష్టం

60 ఆర్థిక వ్యవస్థల నుంచి వచ్చే దిగుమతులపై 10 నుంచి 12.5 శాతం వరకు అదనపు సుంకాలు విధించాలనే అమెరికా ప్రతిపాదనను భారత పరిశ్రమల సమాఖ్యలు తీవ్రంగా వ్యతిరేకించాయి. యూఎస్‌టీఆర్‌ ప్యానెల్ ముందు ఫిక్కీ ప్రతినిధి పూర్ణిమా షెనాయ్ సాక్ష్యమిస్తూ ఈ అదనపు సుంకాల భారం అంతిమంగా అమెరికా పైనే పడుతుందని హెచ్చరించారు. ‘ఈ నిర్ణయం వల్ల భారతీయ ఎగుమతిదారులతోపాటు అమెరికా తయారీదారులు, దిగుమతిదారులు, రిటైలర్లు, చివరికి అమెరికన్ వినియోగదారులకు కూడా ఖర్చులు భారీగా పెరుగుతాయి. ఎన్నో అమెరికా పరిశ్రమలు భారతీయ సరఫరాదారుల నాణ్యత, విశ్వసనీయత, అంతర్జాతీయ ప్రమాణాల సమ్మతిని నమ్మి దీర్ఘకాలిక సంబంధాలను కలిగి ఉన్నాయి’ అని చెప్పారు.

ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప మార్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement