మార్కెట్లో ‘ఫెడ్‌’ అప్రమత్తత | India stock markets seen volatile ahead of Fed policy | Sakshi
Sakshi News home page

మార్కెట్లో ‘ఫెడ్‌’ అప్రమత్తత

Dec 16 2021 8:03 AM | Updated on Dec 16 2021 8:03 AM

India stock markets seen volatile ahead of Fed policy - Sakshi

ముంబై: అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ పాలసీ ప్రకటనకు అప్రమత్తత చోటు చేసుకోవడంతో స్టాక్‌ సూచీలు నాలుగోరోజూ నష్టాలను చవిచూశాయి. ద్రవ్యోల్బణ భయాలు, ఒమిక్రాన్‌ వేరియంట్‌ వైరస్‌ వ్యాప్తి ఆందోళనలు కొనసాగాయి. రూపాయి విలువ 20 నెలల కనిష్టానికి దిగిరావడం, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌ను మరింత బలహీనపరిచాయి. ఫలితంగా  బుధవారం సెన్సెక్స్‌ 329 పాయింట్లు పతనమై 58వేల దిగువున 57,788 వద్ద ముగిసింది. నిఫ్టీ 104 పాయింట్లు నష్టపోయి 17,221 వద్ద నిలిచింది.

ఆటో షేర్లు మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఐటీ, మెటల్‌ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. కేంద్రం సెమి కండెక్టర్ల తయారీకి ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్‌ఐ) పథకాన్ని ప్రకటించడంతో ఆటో షేర్లు ర్యాలీ చేశాయి. చిన్న, మధ్య తరహా షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు అరశాతానికి పైగా క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3407 కోట్ల షేర్లను అమ్మేయగా.., దేశీ ఇన్వెస్టర్లు రూ.1553 కోట్ల షేర్లను కొన్నారు. గడిచిన నాలుగురోజుల్లో సెన్సెక్స్‌ 1,019 పాయింట్లు, నిఫ్టీ 290 పాయింట్లను కోల్పోయాయి. ఫెడ్‌ రిజర్వ్‌ పాలసీ వెల్లడికి ముందు ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్‌ అవుతున్నాయి.

ఇంట్రాడేలో ఒడిదుడుకులు ..! 
ఉదయం సెన్సెక్స్‌ ఐదు పాయింట్ల స్వల్ప లాభంతో 58,122 వద్ద, నిఫ్టీ ఒక పాయింటు స్వల నష్టంతో 17,324 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి సెషన్‌లో అమ్మకాలు జరగడంతో సెన్సెక్స్‌ 445 పాయింట్లు నష్టపోయి 57,672 వద్ద, నిఫ్టీ 133 పాయింట్లను కోల్పోయి 17,192 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. అయితే మిడ్‌సెషన్‌ నుంచి కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు కొంతమేర రికవరీ అయ్యాయి. మొత్తంగా ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 547 పాయింట్ల పరిధిలో 57,671 వద్ద కనిష్టాన్ని, 58,218 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 17,192 – 17,351 మధ్య కదలాడింది  

దూసుకెళ్లిన ఆటో షేర్లు  
కొన్నేళ్లుగా ఆటో పరిశ్రమను వేధిస్తున్న సెమి కండెక్టర్ల కొరతను తీర్చేందుకు కేంద్రం పీఎల్‌ఐ పథకాన్ని ప్రకటించడంతో ఆటో షేర్లు దూసుకెళ్లాయి. ఈ రంగానికి చెందిన టీవీఎస్‌ మోటార్స్, మారుతీ సుజుకీ, ఎమ్‌అండ్‌ఎం, హీరోమోటోకార్ప్, బజాజ్‌ ఆటో షేర్లు ఒకటిన్నర శాతం నుంచి అరశాతం ర్యాలీ చేశాయి. ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాల సూచీలు నష్టపోగా ఒక్క నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ మాత్రం అరశాతం లాభంతో ముగిసింది. 

మార్కెట్లో మరిన్ని సంగతులు... 
యాంకర్‌ ఇన్వెస్టర్ల లాక్‌ – ఇన్‌ పీరియడ్‌ ముగియడంతో పేటీఎం షేరులో అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్‌ఈలో ఎనిమిది శాతం నష్టపోయి రూ.1380 వద్ద స్థిరపడింది. 
ఇన్వెస్టర్లు, ఆర్థిక విశ్లేషకుల సమావేశం ఇన్వెస్టర్లను మెప్పించలేకపోవడంతో ఐటీసీ షేరు రెండు శాతం నష్టపోయి రూ.224 వద్ద ముగిసింది.  
జర్మనీ చర్మ సంరక్షణ బ్రాండ్‌ క్రీమ్‌21ను భారత మార్కెట్లోకి విడుదల చేయడంతో ఇమామీ షేరు నాలుగుశాతం లాభపడి రూ.548 వద్ద నిలిచింది.  
లుపిన్‌ షేరులో లాభాల స్వీకరణ జరగడంతో మూడు శాతం నష్టంతో రూ.919 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement