సాంకేతిక మార్పులను అందిపుచ్చుకోవడంలో భారత్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇప్పుడు ప్రకటనల రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంలో భారత్ ప్రపంచ దేశాల కంటే వేగంగా దూసుకుపోతోందని ప్రముఖ గ్లోబల్ యాడ్టెక్ సంస్థ తబూలా (Taboola) వ్యవస్థాపకుడు, సీఈఓ ఆడమ్ సింగోల్డా స్పష్టం చేశారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. భారతీయ ప్రకటనకర్తలు, పబ్లిషర్లు కొత్త ప్రయోగాలకు ఏమాత్రం వెనుకాడటం లేదన్నారు. వైఫల్యాలు ఎదుర్కోవడానికైనా సిద్ధపడుతూ ఏఐ స్వీకరణలో దూకుడు ప్రదర్శిస్తున్నారని ప్రశంసించారు. సింగోల్డా తన 15 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ చూడనంత గణాంకాలను భారత్లో చూస్తున్నట్లు వెల్లడించారు. ‘కంపెనీ ప్రవేశపెట్టిన డీపర్ డైవ్ ప్రొడక్ట్ ద్వారా వినియోగదారులు పబ్లిషర్ సైట్లలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీని ‘క్లిక్-త్రూ రేట్’ డబుల్ డిజిట్లో ఉంది. ఏఐ ఆధారిత ఈ యాడ్ ప్లాట్ఫామ్ కోసం ఏటా రూ.80 లక్షలకు పైగా ఖర్చు చేసే ప్రకటనకర్తల సంఖ్య గతేడాది భారీగా పెరిగింది’ అని అన్నారు.
డిజిటల్ డిమాండ్
ప్రముఖ అడ్వర్టైజింగ్ సంస్థ మెడిసన్ వరల్డ్ తన తాజా వ్యయ నివేదికలో 2026 నాటికి భారతీయ మార్కెట్ పూర్తిగా డిజిటల్ డిమాండ్తో నడుస్తుందని విశ్లేషించింది. ఏఐ టూల్స్ వాడటం వల్ల క్యాంపెయిన్ మేనేజ్మెంట్లో వారానికి సగటున 5.2 గంటలు (ఏడాదికి దాదాపు 30 పనిదినాలు) ఆదా అవుతున్నట్లు పేర్కొంది. ఏఐ ద్వారా విజువల్స్, కంటెంట్ రూపొందించడం సులభతరం కావడంతో చిన్న సంస్థలు కూడా పెద్ద కార్పొరేట్ కంపెనీల స్థాయిలో నాణ్యమైన ప్రకటనలు ఇవ్వగలుగుతున్నాయని తెలిపింది.
2027 నాటికి ఏజెన్సీల విభజన
భవిష్యత్తులో అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు రెండు విభాగాలుగా విడిపోయే అవకాశం ఉందని మెడిసన్ వరల్డ్ అంచనా వేసింది. అందులో సిస్టమ్స్ ఏజెన్సీలు సొంతంగా ఏఐ ఫ్రేమ్వర్క్లు, మేధో సంపత్తిని కలిగి ఉండి ఫలితాల ఆధారంగా పని చేస్తాయి. సర్వీస్ ఏజెన్సీలు కేవలం ప్లాట్ఫామ్ టూల్స్ను ఉపయోగించి క్లయింట్లకు సేవలను అందిస్తాయని చెప్పింది.
వినియోగదారుల అలవాట్లు
భారత్లో వినియోగదారులు కూడా టెక్నాలజీని వేగంగా స్వీకరిస్తున్నారు. గణాంకాల ప్రకారం, 65 శాతం మంది భారతీయులు రోజూ ఏదో ఒక రూపంలో ఏఐని ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఈ-కామర్స్ మార్కెట్గా ఉన్న భారత్ ఏఐ అడ్వర్టైజింగ్కు అడ్డాగా మారబోతోందని సింగోల్డా ధీమా వ్యక్తం చేశారు. అయితే త్వరలోనే ఏఐని ప్రాథమిక దశలో కాకుండా పూర్తిస్థాయిలో వినియోగించే సంస్థలకు, వెనుకబడిన సంస్థలకు మధ్య వ్యత్యాసం భారీగా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: ఆర్థిక నిర్ణయాల్లో మహిళా గళం


