
క్రిప్టో ఆస్తులపై భవిష్యత్ విధాన నిర్ణయాలకు పునాది వేసే వివరణాత్మక చర్చా పత్రాన్ని రూపొందించే చివరి దశలో భారత్ ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. త్వరలోనే ప్రజలు, ఆర్థిక నిపుణుల ఫీడ్ బ్యాక్ కోసం ఈ చర్చా పత్రాన్ని విడుదల చేస్తామని విశ్వసనీయ వర్గాలు ధ్రువీకరించాయి. ఈ పత్రం రూపొందించేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డు (ఎఫ్ఎస్బీ) సంయుక్తంగా అభివృద్ధి చేసిన సంశ్లేషణ పత్రం నుంచి వివరాలు తీసుకున్నట్లు తెలిసింది.
వర్చువల్ డిజిటల్ ఆస్తులపై చర్చాపత్రానికి తుది మెరుగులు దిద్దుతున్నట్లు ఈ ప్రక్రియలో పాల్గొన్న సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇది పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన తర్వాత క్రిప్టోపై భారతదేశం విస్తృత నియంత్రణ విధానాన్ని రూపొందించేందుకు తోడ్పడుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో కొందరు నిపుణులు క్రిప్టో విషయంలో భారత్ వైఖరిని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం 2022లో వర్చువల్ డిజిటల్ ఆస్తుల నుంచి వచ్చే లాభాలపై 30% పన్నును ప్రవేశపెట్టినప్పటికీ చట్టపరమైన గుర్తింపులో తేడాలున్నట్లు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ చర్చాపత్రంలోని అంశాలు అమల్లోకి వస్తే దేశంలో పనిచేస్తున్న అన్ని క్రిప్టో ఎక్స్ఛేంజీలు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.
ఇదీ చదవండి: మొబైల్లో త్వరగా ఛార్జింగ్ అయిపోతుందా?
గ్లోబల్ క్రిప్టో చర్చల్లో భారత్ ఇప్పటికే ప్రముఖ పాత్ర పోషించింది. జీ20 సదస్సులో గ్లోబల్ రెగ్యులేటరీ రోడ్ మ్యాప్ను ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరించింది. ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల మద్దతుతో ఆ రోడ్ మ్యాప్ పర్యవేక్షణకు పిలుపునిచ్చింది. క్రిప్టో అసెట్ మార్కెట్లు రిస్క్తో కూడుకున్న నేపథ్యంలో ఎఫ్ఎస్బీ సిఫార్సులను న్యూఢిల్లీ జీ20 లీడర్స్ డిక్లరేషన్ కూడా ఆమోదించింది. గ్లోబల్ డిజిటల్ ఫైనాన్స్ గవర్నెన్స్లో భారత్ పాత్రను ఇది బలోపేతం చేసింది.