ఆదాయపన్ను వసూళ్లు రూ.5.21 లక్షల కోట్లు | India Direct Tax Collections Rise 15% To Rs 5.21 Lakh Crore | Sakshi
Sakshi News home page

ఆదాయపన్ను వసూళ్లు రూ.5.21 లక్షల కోట్లు

Jun 19 2026 10:23 AM | Updated on Jun 19 2026 10:35 AM

India Direct Tax Collections Rise 15% To Rs 5.21 Lakh Crore

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి జూన్‌ 17 నాటికి నికర ఆదాయపన్ను (ప్రత్యక్షపన్ను) వసూళ్లు 15 శాతం వరకు పెరిగి రూ.5.21 లక్షల కోట్లుగా ఉన్నట్టు ప్రభుత్వ డేటా స్పష్టం చేసింది. నికర కార్పొరేట్‌ పన్నుల వసూళ్లు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 22 శాతం వృద్ధితో రూ.2.08 లక్షల కోట్లకు చేరాయి.

నికర నాన్‌ కార్పొరేట్‌ పన్నుల ఆదాయం 8 శాతం పెరిగి రూ.2.94 లక్షల కోట్లుగా నమోదైంది. వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు, వాణిజ్య సంస్థల పన్నులు నాన్‌ కార్పొరేట్‌ కిందకు వస్తాయి. రిఫండ్‌లు మే 17 నాటికి రూ.89,026 కోట్లుగా ఉన్నాయి. సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) రూపంలో ఆదాయం 45 శాతం పెరిగి రూ.18,856 కోట్లకు చేరింది. ముందస్తు పన్ను చెల్లింపులు 15.30 శాతం  అధికమై రూ.1.78 లక్షల కోట్లు వసూలయ్యాయి.

స్థూల పన్ను వసూళ్లు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు జూన్‌ 17 నాటికి 12.46 శాతం పెరిగి రూ.6.10 లక్షల కోట్లుగా ఉన్నాయి. ప్రత్యక్ష పన్నుల రూపంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.26.97 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుందన్నది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ లక్ష్యంగా ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement