బ్యాంకు డిపాజిట్లకు మరింత భద్రత.. త్వరలో బీమా పరిమితి పెంపు! | India to Boost Bank Deposit Insurance Beyond Rs 5 Lakh in Next 6 Months | Sakshi
Sakshi News home page

బ్యాంకు డిపాజిట్లకు మరింత భద్రత.. త్వరలో బీమా పరిమితి పెంపు!

May 26 2025 9:07 AM | Updated on May 26 2025 9:24 AM

India to Boost Bank Deposit Insurance Beyond Rs 5 Lakh in Next 6 Months

బ్యాంకుల్లో డబ్బులు పెడితే భద్రంగా ఉంటాయనేది చాలా మంది విశ్వాసం. ఎందుకంటే వీటికి బీమా రక్షణ ఉంటుంది. ప్రస్తుతం రూ.5లక్షల వరకూ డిపాజిట్లపై ప్రభుత్వం బీమా కల్పిస్తోంది. డిపాజిటర్లలో విశ్వాసాన్ని మరింత పెంచేందుకు బ్యాంకు డిపాజిట్లకు సంబంధించిన బీమా పరిమితిని ప్రస్తుత రూ.5 లక్షల నుండి మరింత పెంచే దిశగా చర్చలు జరుపుతోంది. రాబోయే ఆరు నెలల్లో ఈ పెంపు అమలులోకి వచ్చే అవకాశం ఉందని ఆర్థిక శాఖలోని ఒక సీనియర్ అధికారిని ఉటంకిస్తూ బిజినెస్‌ స్టాండర్ట్‌ పత్రిక పేర్కొంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనుబంధ సంస్థ అయిన డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) ప్రస్తుతం  ఒక డిపాజిటర్‌కు ఒక బ్యాంకులో గల సేవింగ్స్, ఫిక్స్‌డ్, కరెంట్, రికరింగ్ డిపాజిట్లపై రూ.5 లక్షల వరకు బీమా సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ బీమా సౌకర్యం వాణిజ్య బ్యాంకులతో పాటు సహకార బ్యాంకులకు కూడా వర్తిస్తుంది.

ఇటీవల న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంకు వంటి కొన్ని బ్యాంకుల వైఫల్యం నేపథ్యంలో, డిపాజిటర్లలో విశ్వాసాన్ని పెంపొందించడానికి, ఆర్థిక భద్రతను మెరుగుపరచడానికి ఈ బీమా పరిమితిని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త బీమా పరిమితి రూ.8 లక్షల నుండి రూ.12 లక్షల వరకు ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక నిర్ణయం తీసుకోలేదు.

ఈ బీమా పరిమితి పెంపు వల్ల బ్యాంకులు డీఐసీజీసీకి చెల్లించే ప్రీమియం ఖర్చులు పెరగనున్నాయి. దీని వల్ల బ్యాంకుల లాభదాయకతపై ఏటా రూ.1,800 కోట్ల నుండి రూ.12,000 కోట్ల వరకు ప్రభావం పడవచ్చని, ఫలితంగా రిటర్న్ ఆన్ అసెట్స్ (ROA), రిటర్న్ ఆన్ ఈక్విటీ (ROE) తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ నిర్ణయాన్ని డిపాజిటర్లకు మరింత ఆర్థిక భద్రతను అందించడంతో పాటు, బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని మరింత పటిష్టం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణిస్తున్నారు. అయితే, ఈ పెంపును అమలు చేయడానికి ముందు బ్యాంకుల ఆర్థిక స్థితిపై దాని ప్రభావాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement